మెదక్ జిల్లా – చిన్నశంకరంపేట : ప్రత్యేక గ్రామసభల ద్వారా ప్రజా సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారం లభిస్తుందని, గ్రామాల అభివృద్ధికి ప్రజలందరూ భాగస్వాములు కావాలని డీఎల్పీవో సురేష్బాబు, మండల ప్రత్యేక అధికారి దామోదర్, ఎంపీవో వినోద్కుమార్ పిలుపునిచ్చారు.
సోమవారం చిన్నశంకరంపేట మండలంలోని చందంపేట, ఖాజాపూర్, సూరారం తదితర గ్రామాల్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక-99 రోజుల కార్యాచరణలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామపంచాయతీలలో నిర్వహించిన ప్రత్యేక గ్రామసభల్లో వారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా చందంపేట గ్రామాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు.
గ్రామాల్లో మురికి కాలువలను శుభ్రపరచడం, పిచ్చి మొక్కలను తొలగించడం, తాగునీటి వనరులు మరియు వాటర్ ట్యాంకులను పరిశుభ్రంగా ఉంచడం, వీధి దీపాల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. అలాగే తడి, పొడి, శానిటరీ వ్యర్థాలను వేర్వేరుగా నిర్వహించడం ద్వారా పరిశుభ్రమైన వాతావరణాన్ని నెలకొల్పాలని సూచించారు.
గ్రామసభల్లో తాగునీటి నిర్వహణ, వర్షపు నీటి సంరక్షణ, మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణ, విపత్తు నిర్వహణ అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అదేవిధంగా ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రజలు సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సర్పంచులు నాయిని ప్రవీణ్కుమార్, చిలుక నాగరాజు, మన్నె బాలస్వామి, ప్రత్యేక అధికారులు దామోదర్, శేఖర్, ఎంపీవో వినోద్కుమార్ తదితరులు పాల్గొన్నారు.









