మెదక్ : ప్రజలకు తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో న్యాయం అందించేందుకు నిర్వహించబడుతున్న జాతీయ లోక్ అదాలత్ను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 20వ తేదీన నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్లో వివిధ రకాల పెండింగ్ కేసులు, ట్రాఫిక్ చలానాలు, రాజీకి అవకాశం ఉన్న క్రిమినల్ కేసులు, కుటుంబ వివాదాలు, సివిల్ వివాదాలు తదితర అంశాలను పరస్పర అంగీకారంతో త్వరితగతిన పరిష్కరించుకునే అవకాశం ఉందని తెలిపారు.
లోక్ అదాలత్ ద్వారా కేసులు పరిష్కారమైతే దీర్ఘకాలిక న్యాయ ప్రక్రియ నుంచి ఉపశమనం లభించడంతో పాటు సమయం, ధనం ఆదా అవుతాయని పేర్కొన్నారు. కోర్టుల్లో పెండింగ్లో ఉన్న వివాదాలను సామరస్యపూర్వకంగా ముగించేందుకు ఇది మంచి అవకాశమని అన్నారు.
ప్రజలు తమ కేసులకు సంబంధించిన వివరాలను సంబంధిత కోర్టులు, న్యాయవాదులు లేదా పోలీసు అధికారులను సంప్రదించి, లోక్ అదాలత్లో పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని పరస్పర అవగాహనతో తమ వివాదాలను ముగించుకోవాలని ఎస్పీ కోరారు.
“సామరస్య పరిష్కారమే శాశ్వత పరిష్కారం” అనే సందేశంతో జాతీయ లోక్ అదాలత్లో పాల్గొని న్యాయపరమైన సమస్యలను సులభంగా పరిష్కరించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.








