పాకాల (చంద్రగిరి నియోజకవర్గం), తిరుపతి జిల్లా: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించి జారీ చేసిన జీఓ నెంబర్ 396ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పాకాల మండలానికి చెందిన డాక్యుమెంట్ రైటర్లు ఆందోళన బాట పట్టారు. తమ డిమాండ్ల సాధన కోసం సోమవారం (జూలై 20) నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు ప్రకటించారు.
ఈ నేపథ్యంలో ఆదివారం పాకాల మండల డాక్యుమెంట్ రైటర్ల అసోసియేషన్ ప్రతినిధులు చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నానిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. జీఓ 396 వల్ల డాక్యుమెంట్ రైటర్ల జీవనోపాధి తీవ్రంగా దెబ్బతింటుందని, ఈ ఉత్తర్వును వెంటనే రద్దు చేసి తమకు న్యాయం చేయాలని ఎమ్మెల్యేను కోరారు. తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
డాక్యుమెంట్ రైటర్లు మాట్లాడుతూ, జీఓ అమలుతో తమ ఉపాధి సంక్షోభంలో పడిందని, వేలాది కుటుంబాల జీవనాధారం ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుని జీఓను ఉపసంహరించుకోవాలని కోరారు.
తమ నిరసనలో భాగంగా సోమవారం నుంచి రిజిస్ట్రేషన్కు సంబంధించిన ఎలాంటి డాక్యుమెంట్లు రాయకూడదని నిర్ణయించుకున్నట్లు అసోసియేషన్ సభ్యులు వెల్లడించారు. అలాగే సమ్మెకు సంబంధించిన వినతిపత్రాన్ని సోమవారం ఉదయం పాకాల సీఐకి కూడా అందజేయనున్నట్లు తెలిపారు.
ప్రభుత్వం స్పందించి జీఓ 396ను రద్దు చేసే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని డాక్యుమెంట్ రైటర్లు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో పాకాల మండలానికి చెందిన పలువురు డాక్యుమెంట్ రైటర్లు, డాక్యుమెంట్ రైటర్ల అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.








