కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: జిల్లాలోని GMREIS / TJC ఇంటర్మీడియట్ బాయ్స్–2 కళాశాలలో విధులు నిర్వహిస్తున్న జూనియర్ లెక్చరర్లు తమ సేవలను కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ సంబంధిత అధికారులకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా జూనియర్ లెక్చరర్లు ఆర్. శ్రీనివాస్, డి. హేమరాజ్, పి. వినోద్ కుమార్, ఆర్. దేవయాని, నసీయా బేగం మాట్లాడుతూ, తమ సేవలను రద్దు చేసేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారని ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాల అభివృద్ధి, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తాము ఎల్లప్పుడూ నిబద్ధతతో విధులు నిర్వర్తించామని తెలిపారు. సాధారణ పనిదినాలతో పాటు సెలవు రోజులలో కూడా కళాశాలకు హాజరై విద్యార్థుల విద్యాభ్యాసానికి ఎలాంటి అంతరాయం కలగకుండా సేవలు అందించామని పేర్కొన్నారు.
అయితే తమకు ఎలాంటి సరైన వివరణ లేదా కారణం తెలియజేయకుండా అకస్మాత్తుగా సేవలను నిలిపివేసే ప్రక్రియ చేపట్టడం తీవ్ర మనస్తాపానికి గురిచేసిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై ఇప్పటికే జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి, ప్రాంతీయ స్థాయి సమన్వయకర్త, కళాశాల ప్రిన్సిపాల్ను కలిసి తమ సమస్యను వివరించినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి సానుకూల పరిష్కారం లభించలేదని తెలిపారు.
విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తమ సేవలను కొనసాగించే అవకాశం కల్పించాలని, తమ సమస్యను న్యాయబద్ధంగా పరిశీలించి తగిన పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను జూనియర్ లెక్చరర్లు విజ్ఞప్తి చేశారు. అలాగే తమ వినతిపై ప్రభుత్వం, సంబంధిత శాఖ అధికారులు సానుకూలంగా స్పందించి న్యాయం చేయాలని వారు కోరారు.








