పార్వతీపురం మన్యం జిల్లా, కురుపాం నియోజకవర్గంలోని గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో ఉన్న కురుపాం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రతి నెల మూడవ బుధవారం నిర్వహించే నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశానికి ప్రభుత్వ విప్, కురుపాం శాసనసభ్యురాలు శ్రీమతి తోయక జగదీశ్వరి అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి మాట్లాడుతూ, పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి మరింత సమర్థవంతంగా తీసుకెళ్లాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించి, వాటి ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అలాగే ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్.ఐ.ఆర్) కార్యక్రమంలో జరుగుతున్న మార్పులు, చేర్పులపై సమావేశంలో సవివరంగా చర్చించారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే ఆదేశించారు.
నియోజకవర్గ పరిధిలో పార్టీ కార్యకర్తలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు, ప్రజలకు సంబంధించిన సమస్యలపై సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. స్థానిక స్థాయిలో పరిష్కరించగలిగిన సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు అధికారులు, పార్టీ నాయకులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
నియోజకవర్గ పరిధిని మించిన సమస్యలను ప్రతి నెల నాల్గవ బుధవారం పార్లమెంట్ స్థాయిలో నిర్వహించే సమీక్ష సమావేశంలో సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.
పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని, ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాలని ఆమె పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








