గోదావరిఖని: రామగుండం డిజిటల్ మీడియా జర్నలిస్టుల ఫోరం నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పాత్రికేయుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, వృత్తి అభివృద్ధిని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని నూతన కమిటీ బాధ్యతలు చేపట్టనున్నట్లు సమావేశంలో వెల్లడించారు.
నూతన కార్యవర్గంలో అధ్యక్షుడిగా కనుకుంట్ల రమేష్, వర్కింగ్ ప్రెసిడెంట్గా వడ్లకొండ మహేందర్ గౌడ్, ఉపాధ్యక్షులుగా గద్దల అనిల్ కుమార్, పురమల తిరుపతి, ప్రధాన కార్యదర్శిగా మామిడి స్వామి, కోశాధికారిగా పెగడపల్లి అశోక్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా గుడిసెల నంబయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ రామగుండం ప్రాంతంలోని డిజిటల్ మీడియా జర్నలిస్టుల మధ్య ఐక్యతను మరింత బలోపేతం చేయడంతో పాటు, పాత్రికేయుల సమస్యల పరిష్కారం, సంక్షేమం, వృత్తి గౌరవ పరిరక్షణ కోసం సమిష్టిగా కృషి చేస్తామని తెలిపారు. డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు అవసరమైన శిక్షణ, న్యాయపరమైన అవగాహన, సామాజిక భద్రత కల్పించే దిశగా ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు.
సభ్యులందరి సహకారంతో ఫోరంను మరింత బలోపేతం చేసి, పాత్రికేయుల ప్రయోజనాల కోసం నిరంతరం పనిచేస్తామని నూతన కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. సమావేశంలో పలువురు డిజిటల్ మీడియా జర్నలిస్టులు పాల్గొని నూతన కార్యవర్గానికి అభినందనలు తెలియజేస్తూ విజయవంతమైన పదవీకాలాన్ని ఆకాంక్షించారు.








