contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

స్టాక్ మార్కెట్లలో రక్తపాతం.. ఒక్కరోజే రూ. 8 లక్షల కోట్లు ఆవిరి!

ముంబై: అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ పెరిగిన భౌగోళిక ఉద్రిక్తతలు భారత స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి. అంతర్జాతీయ ఆందోళనలతో బుధవారం దేశీయ ఈక్విటీ మార్కెట్లలో భారీ అమ్మకాల ఒత్తిడి నెలకొనడంతో సూచీలు రెండేళ్లలోనే అతిపెద్ద పతనాల్లో ఒకటిని నమోదు చేశాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపద ఒక్కరోజే సుమారు రూ.8 లక్షల కోట్లు ఆవిరైంది.

ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 1,677 పాయింట్లు కోల్పోయి 76,503.60 వద్ద ముగియగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 517 పాయింట్లు పతనమై 23,882.05 వద్ద స్థిరపడింది. బ్యాంకింగ్, ఎఫ్‌ఎంసీజీ, ఆయిల్ అండ్ గ్యాస్, ఆటో, ఐటీ తదితర రంగాలకు చెందిన షేర్లలో భారీ అమ్మకాలు నమోదయ్యాయి.

మార్కెట్ పతనానికి ప్రధాన కారణంగా అమెరికా-ఇరాన్ మధ్య తాజా ఉద్రిక్తతలే నిలిచాయి. ఇరాన్‌తో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిపోయిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో అంతర్జాతీయ మార్కెట్లలో ఆందోళన నెలకొంది. దీంతో పెట్టుబడిదారులు రిస్క్ ఉన్న ఆస్తుల నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకోవడం ప్రారంభించారు.

అదే సమయంలో ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన హార్ముజ్ జలసంధిలో అంతరాయం ఏర్పడే అవకాశాలపై భయాలు పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు ఒక్కసారిగా ఎగిశాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర సుమారు ఐదు శాతం పెరిగి బ్యారెల్‌కు 78 డాలర్లకు చేరుకోవడం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.

ఈ పరిణామాల ప్రభావం భారత కరెన్సీపైనా స్పష్టంగా కనిపించింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.50 స్థాయిని దాటి మరింత బలహీనపడింది. పెరుగుతున్న చమురు ధరలు, దిగుమతి వ్యయాలపై ఆందోళనలు పెట్టుబడిదారుల్లో ఆర్థిక అనిశ్చితిని పెంచుతున్నాయని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ మాట్లాడుతూ, పశ్చిమాసియాలో మళ్లీ రాజుకున్న ఉద్రిక్తతలు ద్రవ్యోల్బణంపై కొత్త ఆందోళనలకు దారితీస్తున్నాయని తెలిపారు. ఇటీవల మార్కెట్లు నమోదు చేసిన లాభాలన్నీ ఈ ఒక్క ట్రేడింగ్ సెషన్‌లోనే తుడిచిపెట్టుకుపోయాయని ఆయన వ్యాఖ్యానించారు.

ప్రపంచ పరిణామాలపై పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉండాలని, పశ్చిమాసియా పరిస్థితులు, ముడిచమురు ధరల కదలికలు, అమెరికా ఆర్థిక విధానాలు రానున్న రోజుల్లో భారత మార్కెట్ల దిశను నిర్ణయించే కీలక అంశాలుగా మారే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :