హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర డీజీపీగా సేవలందించిన బి. శివధర్ రెడ్డి ఈరోజు పదవీ విరమణ పొందారు. పదవీ విరమణ అనంతరం వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు కీలక బాధ్యతలను అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ భద్రతా సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రానికి ఆయన సేవలు మరింత అవసరమని భావించిన ప్రభుత్వం, ఈ కీలక నిర్ణయం తీసుకుంది. శివధర్ రెడ్డిని చీఫ్ సెక్రటరీ హోదాలో ఈ పదవికి నియమించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. బాధ్యతలు స్వీకరించిన తేదీ నుండి మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.
భద్రతా సలహాదారుగా ఆయన శాంతిభద్రతల పరిరక్షణ, అంతర్గత భద్రత, నేర నియంత్రణ వంటి అంశాలపై ప్రభుత్వానికి సలహాలు అందించనున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న డ్రగ్స్ నియంత్రణ (నార్కోటిక్స్ కంట్రోల్), రోడ్డు భద్రత వంటి కీలక అంశాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు.
వేతనం, సౌకర్యాలు:
ఈ పదవిలో శివధర్ రెడ్డికి నెలకు రూ. 2.25 లక్షల వేతనం అందుతుంది. అదనంగా రూ. 50,000 ఇంటి అద్దె భత్యం కూడా లభిస్తుంది.
ప్రభుత్వం ఆయనకు ప్రభుత్వ వాహనం, టీఏ/డీఏ, మెడికల్ రీయింబర్స్మెంట్ వంటి సౌకర్యాలను కల్పించింది. అలాగే ఆయన విధులు నిర్వర్తించేందుకు హోంశాఖ ఆధ్వర్యంలో ఒక ఓఎస్డీ, ప్రైవేట్ సెక్రటరీ, ఇద్దరు డ్రైవర్లు, నలుగురు ఆఫీస్ సిబ్బందితో ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది.
ఈ నియామకం ద్వారా రాష్ట్ర భద్రతా వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.









