పశ్చిమ బెంగాల్: ముర్షిదాబాద్ జిల్లాలో గత నెలలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేత ప్రమేయం ఉన్నట్లు కలకత్తా హైకోర్టు నియమించిన విచారణ కమిటీ తన నివేదికలో వెల్లడించింది. వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందుతున్న సమయంలో చెలరేగిన ఈ దాడులు ప్రధానంగా హిందువులను లక్ష్యంగా చేసుకుని జరిగాయని, బాధితులు సహాయం కోసం అభ్యర్థించినప్పటికీ స్థానిక పోలీసులు స్పందించడంలో విఫలమయ్యారని నివేదిక పేర్కొంది.
ముర్షిదాబాద్లో జరిగిన హింసాత్మక ఘటనలపై హైకోర్టు ఏర్పాటు చేసిన విచారణ కమిటీ సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చింది. ఈ దాడులకు స్థానిక కౌన్సిలర్, తృణమూల్ కాంగ్రెస్ నేత మెహబూబ్ ఆలం సూత్రధారి అని నివేదిక ఆరోపించింది. “స్థానిక కౌన్సిలర్ మెహబూబ్ ఆలం దుండగులతో కలిసి వచ్చి ఈ దాడులకు పాల్పడ్డారు. పోలీసులు పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. ఘటనా స్థలంలో వారి జాడ కనిపించలేదు” అని నివేదికలో కమిటీ స్పష్టం చేసినట్లు ఆంగ్ల మీడియా పేర్కొంది.
ముఖ్యంగా ఏప్రిల్ 11 మధ్యాహ్నం 2:30 గంటల తర్వాత ఈ దాడి జరిగినట్లు నివేదిక తెలిపింది. దుండగులు విచక్షణారహితంగా ఇళ్లకు నిప్పుపెట్టడం, దుకాణాలు, మాల్స్ను లూటీ చేయడం, ధ్వంసం చేయడం వంటి చర్యలకు పాల్పడ్డారని కమిటీ వివరించింది. ఈ దాడుల కారణంగా బెట్బోనా గ్రామంలోనే 113 ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని నివేదికలో పేర్కొన్నారు. హిందువులే లక్ష్యంగా ఈ విధ్వంసం జరిగిందని, బాధితులు ప్రాణభయంతో పరుగులు తీసినా, పోలీసుల నుంచి సకాలంలో సహాయం అందలేదని కమిటీ తన నివేదికలో ఆవేదన వ్యక్తం చేసింది.
జాతీయ మానవ హక్కుల కమిషన్, రాష్ట్ర న్యాయ సేవల అథారిటీ, న్యాయ సేవల సభ్యులతో కూడిన ఈ విచారణ బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి, బాధితులతో మాట్లాడి, ఆధారాలు సేకరించి ఈ నివేదికను రూపొందించింది. ఈ నివేదికను ఇవాళ కలకత్తా హైకోర్టు డివిజన్ బెంచ్కు సమర్పించారు. ఈ నివేదిక ఆధారంగా హైకోర్టు తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.