- జిల్లా కలెక్టర్ గోపి, సీపీ సుబ్బా రాయుడు, మేయర్ సునీల్ రావు, ఈ ఎన్ సీ శంకర్ హాజరు
- 12 గేట్లు ఎత్తి 24వేల క్యూసెక్కుల నీటి విడుదల
- ఎల్ ఎం డీ కి భారీగా ఇన్ఫ్లో
కరీంనగర్ జిల్లా: ది రిపోర్టర్ టీవీ: లోయరు మానేరు జలాశయం లోకి భారీగా ఇన్ఫ్లో ఉండడంతో గురువారం సాయంత్రం
రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఎల్ఎండి గేట్లను ఎత్తారు. ఎల్ఎండి కి లక్ష క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉన్నందున 12 గేట్లను ఎత్తి సుమారు 24 క్యూసెక్కుల నీటిని మానేరు నదిలోకి వదిలారు. గురువారం సాయంత్రం 6 గంటలకు మంత్రి తో పాటు జిల్లా కలెక్టర్ గోపి, సీపీ సుబ్బా రాయుడు, నగర మేయర్ సునీల్ రావు, ఈ ఎన్ సీ శంకర్ నీటి విడుదల చేశారు.మిడ్ మానేరు గేట్లు ఎత్తి 60 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదలడంతో నీరంతా ఎల్ఎండీ రిజర్వాయర్ లోకి వస్తున్నది. అలాగే ఎగువ ప్రాంతాల నుండి వరద ఉధృతి ఎక్కువగా ఉన్నందున మోయ తుమ్మెద వాగు నుండి 60 వేల క్యూసెక్కుల నీరు ఎల్ఎండిలోకి వచ్చి చేరుతుంది. మొత్తంగా లక్ష క్యూసెక్కులకు పైగా నీరు ఎల్ ఎం డీ లోకి వచ్చి చేరుతుండడంతో వరద ఉధృతి తీవ్రంగా ఉన్నందున గేట్లు ఎత్తాలని అధికారులు నిర్ణయం తీసుకుని మంత్రి తో పాటు జిల్లా అధికారులకు సమాచారం అందించారు. ఎల్ఎండి దిగువ భాగాన మానే రివర్ ఫ్రంట్ పనులు జరుగుతున్నందున ఒకేసారి నీటిని పెద్ద మొత్తంలో విడుదల చేయకుండా కొద్దికొద్దిగా నీటిని విడుదల చేసేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు.24 టీఎంసీల సామర్థ్యం కలిగిన లోయర్ మానేరు జలాశయంలో 17 టిఎంసిల నీరు వుండగానే, ఇన్ఫ్లో ఎక్కువగా ఉన్నందున గేట్లు ఎత్తారు.మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ… ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఎల్ఎండికి వరద భారీగా రావడంతో ముందుగానే గేట్లు ఎత్తినట్లు తెలిపారు.20 టీఎంసీల వరకు నీరు వచ్చిన తరువాత ఇన్ఫ్లో, అవుట్ ఫ్లో విషయంలో అధికారులు ఎప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటారని అన్నారు. ఇన్ఫ్లో పెరిగితే మరిన్ని గేట్లను ఎత్తడం, తగ్గితే గేట్లను దింపడం జరుగుతుందని తెలిపారు. ఒకేసారి భారీ మొత్తంలో నీటిని కిందకు వదలకుండా తక్కువ నీటితో మొదలై కొద్ది కొద్దిగా పెంచడం జరుగుతుందని ఆయన అన్నారు. జిల్లాలో ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ప్రజాప్రతినిధులు అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ప్రజలు సైతం అత్యవసరమైతెనే బయటకి రావాలని లేదంటే ఇండ్లలోనే ఉండాలని మంత్రి సూచించారు.ఆయన వెంట ఎస్ఈ శివకుమార్ ఈఈ నాగభూషణం కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.