చిత్తూరు : చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండల కేంద్రంలోని శ్రీ అభీష్ట మృత్యుంజయ స్వామి ఆలయంలో సేవా టికెట్ల విక్రయాలపై కొనసాగుతున్న వివాదం మరో మలుపు తిరిగింది. హైకోర్టు ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ విశ్వనాథ్ బుధవారం ఆలయంలో క్షేత్రస్థాయి విచారణ చేపట్టారు.
ఆలయంలో సేవా టికెట్ల విక్రయాల వ్యవహారం గత కొంతకాలంగా వివాదాస్పదంగా మారింది. దేవాదాయ శాఖ నిబంధనల ప్రకారం ఆలయంలో నిర్వహించే ప్రత్యేక సేవలు, పూజల కోసం అధికారిక సేవా టికెట్లను విక్రయించాల్సి ఉండగా, దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన అర్చకులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కోర్టుకు సమగ్ర నివేదిక సమర్పించేందుకు దేవాదాయ శాఖ అధికారులు ఆలయాన్ని సందర్శించి పరిస్థితులను పరిశీలించారు.
ఈ సందర్భంగా అసిస్టెంట్ కమిషనర్ విశ్వనాథ్ మాట్లాడుతూ, గతంలో భక్తులు చెల్లించిన సేవా రుసుములు అర్చకుల వ్యక్తిగత ఖాతాల్లో జమ అయ్యేవని, ఇకపై అలాంటి విధానం కొనసాగదని స్పష్టం చేశారు. దేవాదాయ శాఖ జారీ చేసే అధికారిక టికెట్ల ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వ ఖాతాలోనే జమ చేయాల్సి ఉంటుందని తెలిపారు. అనంతరం కమిషనర్ ఆదేశాల మేరకు అర్చకులకు జీతాల రూపంలో చెల్లింపులు జరుగుతాయని వెల్లడించారు.
అయితే ఆలయానికి సంబంధించిన భూ సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదని అర్చకులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ముందుగా ఆలయ భూముల సమస్యను పరిష్కరించి, అప్పటివరకు సేవా టికెట్ల విక్రయాలను నిలిపివేయాలని వారు కోరారు. దీనిపై తమ అభ్యర్థనను లిఖితపూర్వకంగా సమర్పించాలని అధికారులు సూచించారు.
విచారణ అనంతరం దేవాదాయ శాఖ అధికారులు పట్టణ పరిధిలో ఆక్రమణకు గురైన దేవాదాయ శాఖ భూములను పరిశీలించారు. అలాగే గోసల కురపల్లిలోని శివాలయ నూతన నిర్మాణానికి శాఖ తరఫున సహకారం అందించి, అభివృద్ధి పనులకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రూప్ టెంపుల్స్ ఈవో రమణ, దేవాదాయ శాఖ అధికారి శశికుమార్, స్థానిక అర్చకులు మరియు ఇతర ఆలయ ప్రతినిధులు పాల్గొన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు రూపొందించే నివేదిక ఆధారంగా సేవా టికెట్ల వ్యవహారంపై తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.








