న్యూఢిల్లీ : దేశ రాజధాని న్యూఢిల్లీలో అత్యంత అధునాతన సాంకేతికతతో కూడిన భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. భారత మాజీ ప్రధానమంత్రి ఇందర్ కుమార్ గుజ్రాల్ కుమారుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు నరేష్ గుజ్రాల్ పేరును ఉపయోగించి సైబర్ నేరగాళ్లు కోట్ల రూపాయలు కాజేసిన ఘటన సంచలనం రేపుతోంది.
టెక్స్టైల్స్, లెదర్ ఉత్పత్తుల తయారీ రంగంలో వ్యాపారం నిర్వహిస్తున్న నరేష్ గుజ్రాల్ వాట్సాప్ ప్రొఫైల్ ఫొటోను దుర్వినియోగం చేసిన సైబర్ ముఠా, ఆయన పేరుతో నకిలీ వాట్సాప్ ఖాతాను సృష్టించింది. జూన్ 12 నుంచి 16వ తేదీల మధ్య కాలంలో ఈ నకిలీ ఖాతా ద్వారా గుజ్రాల్ కంపెనీ ఆర్థిక విభాగంలో పనిచేస్తున్న నమ్మకస్థుడైన ఉద్యోగిని సంప్రదించి, అత్యవసరంగా కొన్ని బ్యాంకు ఖాతాలకు భారీ మొత్తాలను బదిలీ చేయాలని సూచించింది.
అవతలి వ్యక్తి తన యజమానేనని భావించిన ఉద్యోగి ఎలాంటి అనుమానం వ్యక్తం చేయకుండా నాలుగు విడతల్లో కోట్ల రూపాయలను సైబర్ నేరగాళ్లు సూచించిన బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశాడు. అనంతరం జూన్ 16న జరిగిన నగదు బదిలీల వివరాలను ఆ ఉద్యోగి నరేష్ గుజ్రాల్ కుమార్తె దీక్షా గుజ్రాల్కు తెలియజేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
దీక్షా గుజ్రాల్ వెంటనే తన తండ్రిని సంప్రదించగా, తాను ఎలాంటి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి సూచనలు ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ ద్వారా వెంటనే ఫిర్యాదు చేసి ఎలక్ట్రానిక్ ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు.
ఈ ఘటనపై స్పందించిన 78 ఏళ్ల నరేష్ గుజ్రాల్, ఢిల్లీ సైబర్ క్రైమ్ విభాగం మరియు సంబంధిత బ్యాంకులు అత్యంత వేగంగా స్పందించాయని తెలిపారు. మోసపోయిన మొత్తంలో దాదాపు 70 శాతం నిధులను వివిధ ఖాతాల్లో స్తంభింపజేయడంలో అధికారులు విజయవంతమయ్యారని వెల్లడించారు.
ఇలాంటి మోసాలు జరిగినప్పుడు ప్రజలు, సంస్థలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. సకాలంలో స్పందిస్తే నష్టాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చని పేర్కొన్నారు.
చార్టర్డ్ అకౌంటెంట్ కూడా అయిన నరేష్ గుజ్రాల్ కంపెనీలోనే ఈ తరహా మోసం జరగడం కార్పొరేట్ వర్గాలను కలవరపెడుతోంది. ప్రముఖుల పేర్లు, ఫొటోలను ఉపయోగించి సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో సంస్థలు తమ ఆర్థిక లావాదేవీల ధృవీకరణ విధానాలను మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
ఈ నకిలీ వాట్సాప్ ఖాతా వెనుక ఉన్న సూత్రధారులను గుర్తించి పట్టుకునేందుకు ఢిల్లీ పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. బ్యాంకు ఖాతాల వివరాలు, డిజిటల్ లావాదేవీల ఆధారంగా నిందితుల జాడను కనుగొనే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.








