సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఇటీవల పాకిస్థాన్కు సంబంధించి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తీవ్రస్థాయిలో స్పందించారు, నారాయణపై ఘాటైన విమర్శలు గుప్పించారు.
భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న ప్రస్తుత తరుణంలో, “మన యుద్ధం పాకిస్థాన్ ప్రజలతో కాదు, ఉగ్రవాదంతోనే” అని నారాయణ వ్యాఖ్యానించారు. పాకిస్థాన్పై భారత్ కాల్పులు జరిపి అక్కడి సాధారణ ప్రజలను ఇబ్బందులకు గురిచేయరాదని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా, పాకిస్థాన్కు చైనా మద్దతు ఇస్తోందన్నది కేవలం అపోహ మాత్రమేనని అన్నారు.
నారాయణ చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి ఘటనతో దేశం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయిందని, అలాంటి సమయంలో పాకిస్థాన్పై యుద్ధం చేయవద్దని నారాయణ చెప్పడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.
“పాకిస్థాన్ ప్రజలపై నారాయణకు అంత ప్రేమ ఉంటే, ఆయన తన తట్టాబుట్టా సర్దుకుని పాకిస్థాన్కే వెళ్లిపోవడం మంచిది” అని ఘాటుగా వ్యాఖ్యానించారు. దేశానికి వ్యతిరేకంగా మాట్లాడిన నారాయణను సీపీఐ పార్టీ నుంచి తక్షణమే సస్పెండ్ చేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.