విజయనగరం : ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలిచే భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఘనంగా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాసవర్మ, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు తదితరులు పాల్గొన్నారు.
ప్రారంభోత్సవం అనంతరం ప్రధానమంత్రి మోదీ విమానాశ్రయంలోని టెర్మినల్ భవనాన్ని సందర్శించి అత్యాధునిక సౌకర్యాలను పరిశీలించారు. విమానాశ్రయం నిర్మాణ ప్రత్యేకతలు, ప్రయాణికులకు కల్పించిన సదుపాయాలు, భవిష్యత్ విస్తరణ ప్రణాళికలను జీఎంఆర్ గ్రూప్ ఛైర్మన్ జి. మల్లిఖార్జునరావు, జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ బిజినెస్ ఛైర్మన్ జీబీఎస్ రాజు ప్రధానికి వివరించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర కళా వైభవానికి ప్రతీకగా నిలిచే బొబ్బిలి వీణను ప్రధానమంత్రి మోదీకి బహూకరించి ఘనంగా సత్కరించారు. ఈ ఆత్మీయ ఘట్టం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
అంతకుముందు సభా ప్రాంగణానికి ఓపెన్టాప్ జీపులో చేరుకున్న ప్రధాని మోదీ మార్గమధ్యంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలను ఆసక్తిగా వీక్షించారు. ఇటీవల గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన థింసా నృత్య ప్రదర్శన సభలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. వేలాది మంది యువతులు ప్రదర్శించిన ఈ సాంప్రదాయ నృత్యాన్ని ప్రధాని ప్రత్యేకంగా తిలకించి వారిని అభినందించారు.
ప్రజలకు అభివాదం చేస్తూ సభా వేదికకు చేరుకున్న ప్రధాని మోదీకి పెద్ద ఎత్తున హాజరైన ప్రజలు ఘన స్వాగతం పలికారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభంతో ఉత్తరాంధ్రలో పారిశ్రామిక, పర్యాటక, వాణిజ్య రంగాలకు కొత్త ఊపు లభించడంతో పాటు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి మరింత బలం చేకూరనుందని పలువురు అభిప్రాయపడ్డారు.








