కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలంలోని చాకలివాని పల్లె గ్రామ పరిధిలోని కూనవానిపల్లిలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్, పోల్ విరిగిపోయి సంవత్సరం అవుతున్న విద్యుత్ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. విద్యుత్ తీగలు ఒకదానిపై ఒకటి పడి మోటర్లు కాలిపోతున్నాయని శుక్రవారం ట్రాన్స్ఫార్మర్ వద్ద స్థానిక రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్ స్తంభం విరిగి 11 కేవీ వైర్లు ఒకదానిపై ఒకటి పడి మోటార్లు కాలిపోతున్నాయని, వరి నారు పోసే సమయంలో నారుమడులు ఎండిపోతున్నాయని మండల విద్యుత్ ఏఈ, అధికారులకు రైతులు పలుమార్లు చెప్పిన స్పందించడం లేదని వాపోయారు. తక్షణమే ట్రాన్స్ఫార్మర్ వద్ద విరిగిన విద్యుత్ స్తంభాన్ని మార్చాలని డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించకపోతే గన్నేరువరం సబ్ స్టేషన్ ముందు పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బోయిని బాలయ్య,కూన యాదగిరి, కూన చంద్రశేఖర్, విజేందర్, లచ్చయ్య, రాజు , తదితరులు పాల్గొన్నారు.
