- ఇసుక సరఫరాలో అత్యుత్సాహం చూపిస్తున్న ట్రాక్టర్ల ఓనర్లు..
- మైనర్ లతో డ్రైవింగ్
- ఇందుర్తి టూ హుస్నాబాద్ అక్రమ ఇసుక రవాణా తరలింపు
- సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో ఓ అధికారి అండదండలతో అక్రమ ఇసుక రవాణా..!
కరీంనగర్ జిల్లా: ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే హడావిడి చేసే అధికారులు ఆ ప్రమాదాలు జరగకముందుకే నివారించేందుకు చర్యలు చేపట్టడంలో విఫలం అవుతున్నారు. గతంలో జులై 04-2023 తిమ్మాపూర్ మండలం కొత్తపెళ్లి శివారులో రామంచ గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు ఇసుక ట్రాక్టర్ ఢీకొని మృతి చెందగా అప్పటి ఏసీపీ తాడూరి కరుణాకర్ రావు అక్రమ ఇసుక రవాణా చేస్తే పిడి యాక్ట్ నమోదు చేస్తామని అన్నారు. కానీ అలాంటివి కేవలం మాటలకే పరిమితమై, ఎన్నిసార్లు అక్రమ ఇసుక రవాణా చేస్తూ అధికారులకు దొరికిన కేవలం కేసులు మాత్రమే పెడుతూ చేతులు దులుపుకుంటున్నారని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు.. వివరాల్లోకెళ్తే చిగురుమామిడి మండలం ముదిమాణిక్యం క్రాస్ రోడ్ వద్ద అతివేగంగా ఇసుక రవాణా తో వస్తున్న ట్రాక్టర్ కారు (ఎట్టిక) వాహనాన్ని ఢీకొనడంతో తృటిలో పెద్ద పెను ప్రమాదం తప్పింది. కారు ముందు భాగం ధ్వంసం కాగా, వాహనంలో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలతో బయట పడ్డారు. ఓటీపీల పేరుతో అడ్డు అదుపు లేకుండా మితిమీరిన వేగంతో అజాగ్రత్తగా ఇసుక ట్రాక్టర్లు డ్రైవర్లు నడుపుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందని మండల ప్రజలు భయపడుతున్నారు. మరియు మైనర్లే ట్రాక్టర్ డ్రైవర్లుగా మారడం మరో విశేషం. వాటిపై ప్రత్యేక నిగా పెట్టాల్సిన అధికారులు చూసి చూడనట్టే వ్యవహరిస్తున్నారని పలువురు పలు ఆరోపణలు కూడా చేస్తున్నారు. చిన్న ముల్కనూర్ గ్రామంలో మితిమీరిన వేగంతో ట్రాక్టర్లు నడపడంతో పాఠశాలకు పంపిస్తున్న తల్లిదండ్రులు కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు వారిపై చూపు చూడాల్సిందే అని మండల ప్రజలు అంటున్నారు. ఇందుర్తి మోయ తుమ్మెద వాగు చెక్ డ్యాం నుండి ప్రతిరోజు అక్రమంగా రాత్రి పగలు అనే తేడా లేకుండా సిద్దిపేట జిల్లా సిసిపల్లి, పందిళ్ళ గ్రామాల మీదుగా హుస్నాబాద్ కి ప్రతిరోజు అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని, ఆ మండల ప్రజలు అంటున్నారు. కోహెడ మండలానికి చెందిన ఓ అధికారి అండదండలు కూడా ఉన్నాయని పలు ఆరోపణలు కూడా లేకపోలేదు.ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు అధికారులపై దృష్టి పెట్టి శాఖపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. చిగురుమామిడి మండలంలో ఇటీవల ఓ అధికారి బదిలీ అవుతున్నాడనీ తెలిసి, మండలానికి చెందిన కొంత మంది ఇసుక ట్రాక్టర్ల ఓనర్ల నుండి లక్ష పైచిలుకు డబ్బులు కూడా దండుకున్నాడనే ఆరోపణలు కూడా లేకపోలేదు. జిల్లా ఉన్నతాధికారులు ఇలాంటి అధికారులపై ప్రత్యేకమైన దృష్టి పెట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.