హైదరాబాద్ : తెలంగాణలో రాగల మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (ఐఎండీ) వెల్లడించింది. ఈ మేరకు చాలా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పట్టాయి.
నేటి నుంచి రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో సాయంత్రం, రాత్రి వేళల్లో అక్కడక్కడా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని తెలిపారు.
శుక్రవారం నాటికే రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి. నాగర్కర్నూల్లో అత్యల్పంగా 28.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా, హైదరాబాద్లోని బండ్లగూడలో 30.7 డిగ్రీలుగా నమోదైంది. రాబోయే వర్షాల కారణంగా ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.