పార్వతీపురం, మన్యం జిల్లా కురుపాం: శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి ఆదివారం ఉదయం విజయవాడలో తన స్వగృహంలో గిరిజన నాయకులను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశం మాజీ శాసనసభ్యులు, ఏజేఏసీ మన్యం జిల్లా అధ్యక్షుడు నిమ్మక జయరాజు ఆధ్వర్యంలో జరిగింది.
భేటీలో నియోజకవర్గంలోని పలు కీలక సమస్యలపై వినతిపత్రం ఎమ్మెల్యేకు అందజేయబడింది. ప్రధాన డిమాండ్లు ఇలా ఉన్నాయి:
-
ప్రత్యేక మండలం: కురుపాం మండలంలోని నీలకంఠాపురం కేంద్రంగా గిరిజన ప్రత్యేక మండలంగా ఏర్పాటుచేయాలని విజ్ఞప్తి.
-
జీవో నెంబర్ 3 పునరుద్ధరణ: గతంలో సుప్రీంకోర్టు జీవో నం. 3ని రద్దు చేయడం వలన ఆదివాసీ సమాజానికి, ఉద్యోగ అవకాశాలకు నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం.
-
కొత్త చట్టం: ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ ద్వారా నూతన చట్ట సవరణ ప్రక్రియను ఆమోదించి, గవర్నర్ ద్వారా చట్టం చేయించేలా చూడాలని కోరారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఒప్పించి ప్రక్రియ వేగవంతం చేయాలని అభ్యర్థించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి సానుకూలంగా స్పందించారు. “సమస్యల పరిష్కారానికి నా వంతు కృషి చేస్తాను. అవసరమైతే సంబంధిత శాఖ మంత్రులతో భేటీ ఏర్పాటు చేసి చొరవ తీసుకుంటాను” అని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో పాల్గొన్న వారిలో మాజీ ఎంపీపీ హిమరక నీలకంఠేశ్వరరావు, సర్పంచ్ ఏ. మన్మధరావు, పిసా వైస్ ప్రెసిడెంట్ బిడ్డిక రామారావు, బిడ్డిక కడాయి, ఏజేఏసీ మండల కన్వీనర్ లక్ష్మణరావు, గోత్తిలి శ్రీను, సిపిఎం ప్రధాన కార్యదర్శి బిడ్డిక వెంకటరమణ తదితరులు ఉన్నారు.








