గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని విఠల్నగర్ సింగరేణి సెక్టార్-2 పార్కులో ఎండిపోయిన భారీ వృక్షం ప్రమాదకరంగా మారిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్కులోని పాత భారీ చెట్లు పూర్తిగా ఎండిపోవడంతో ఎప్పుడు కూలిపోతాయోనన్న భయంతో వాకర్లు, కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు.
ఈ పార్కుకు 12, 13, 43, 44 డివిజన్లకు చెందిన ప్రజలు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వాకింగ్కు వస్తుంటారు. అంతేకాకుండా చిన్నారులు ఆడుకునేందుకు ఏర్పాటు చేసిన ఆట వస్తువులు కూడా ఈ ఎండిన వృక్షం సమీపంలోనే ఉండటంతో పిల్లలను ఆ ప్రాంతానికి అనుమతించడం లేదని వాచ్మన్ తెలిపారు.
ఈ సమస్యపై సంబంధిత సింగరేణి అధికారులకు స్థానిక ప్రజాప్రతినిధులు సమాచారం అందజేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఎండిపోయిన వృక్షాన్ని వెంటనే తొలగించి, పార్కులో ప్రజల భద్రతకు అవసరమైన చర్యలు చేపట్టాలని వాకర్లు, కాలనీవాసులు సింగరేణి అధికారులను కోరుతున్నారు. ఏదైనా ప్రమాదం సంభవించకముందే అధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.








