కరీంనగర్: కరీంనగర్ జోన్-III పరిధిలోని కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాల పోలీసు సిబ్బందికి నిర్వహించిన జోనల్ స్థాయి పోలీస్ డ్యూటీ మీట్ విజయవంతంగా ముగిసింది. పోలీసు సిబ్బందిలో వృత్తిపరమైన నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధనా సామర్థ్యాలను పెంపొందించడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ పోటీల్లో సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని ప్రతిభను చాటుకున్నారు.
ఈ డ్యూటీ మీట్లో ఫోరెన్సిక్ సైన్స్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్, క్రిమినల్ లాస్, మెడికో-లీగల్ టెస్ట్, ఫింగర్ ప్రింట్ సైన్స్, క్రైమ్ సీన్ ఫోటోగ్రఫీ, సైబర్ అవగాహన, కంప్యూటర్ అవేర్నెస్, ప్రోగ్రామింగ్, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్తో పాటు వివిధ రకాల సెర్చ్ ఆపరేషన్లు కలిపి మొత్తం 21 విభాగాల్లో కఠినమైన పరీక్షలు నిర్వహించారు.
పోలీస్ శాఖలో ఆధునిక దర్యాప్తు పద్ధతులను మరింత బలోపేతం చేయడం, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచడం, సిబ్బందిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడం ఈ డ్యూటీ మీట్ ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు.

ప్రధాన విభాగాల్లో ఇన్స్పెక్టర్ ఎం. సంపత్ కుమార్ (కామారెడ్డి), సీఐ ఎ. ప్రదీప్ కుమార్ (కరీంనగర్), సీఐ కె. నాగేశ్వరరావు (రాజన్న సిరిసిల్ల) అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఎస్ఐల విభాగంలో బి. వంశీకృష్ణ (కరీంనగర్), వి. రఘుపతి (సిద్దిపేట), ఎన్. రమాకాంత్ (రాజన్న సిరిసిల్ల), ఐ. భార్గవ్ (కామారెడ్డి), జి. నరేందర్ రెడ్డి (కరీంనగర్), వి. లక్ష్మణ్ (రాజన్న సిరిసిల్ల) విజేతలుగా నిలిచారు.
పోలీస్ పోర్ట్రైట్, అబ్జర్వేషన్ టెస్ట్ విభాగాల్లో సిద్దిపేటకు చెందిన ఏఎస్ఐ వి. మధుసూదన్ ప్రథమ స్థానం సాధించగా, పోర్ట్రైట్లో కామారెడ్డికి చెందిన పీసీ ఎస్. లక్ష్మీనారాయణ గౌడ్, అబ్జర్వేషన్లో కరీంనగర్కు చెందిన పీసీ పి. భార్గవ్ ఉత్తమ ప్రతిభ కనబరిచారు.

సెర్చ్ ఆపరేషన్స్ విభాగాల్లో కామారెడ్డికి చెందిన పీసీ పి. రాంచంద్రం వెహికల్ సెర్చ్, రూమ్ సెర్చ్ విభాగాల్లో అగ్రస్థానంలో నిలిచారు. గ్రౌండ్ సెర్చ్లో కరీంనగర్కు చెందిన పీసీ డి. ఎల్లయ్య, సిద్దిపేటకు చెందిన పీసీ ఎన్. నగేష్ విజేతలయ్యారు. యాక్సెస్ కంట్రోల్, ట్రాకింగ్, పేలుడు పదార్థాల గుర్తింపు, నార్కోటిక్స్ శోధన విభాగాల్లో కూడా వివిధ జిల్లాలకు చెందిన పోలీసు సిబ్బంది ప్రతిభను చాటుకున్నారు.
సాంకేతిక విభాగాల్లో కంప్యూటర్ అవేర్నెస్, ఆఫీస్ ఆటోమేషన్, ప్రోగ్రామింగ్ ఎబిలిటీ, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పోటీల్లో మెదక్, సిద్దిపేట, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు చెందిన సిబ్బంది అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. పోలీస్ ఫోటోగ్రఫీ విభాగంలో కరీంనగర్కు చెందిన ఏఆర్పీసీ బి. మల్లేష్, మెదక్కు చెందిన పీసీ ఎన్. శ్రీధర్ గౌడ్ విజేతలుగా నిలవగా, వీడియోగ్రఫీ విభాగంలో ఎన్. శ్రీధర్ గౌడ్ ప్రథమ స్థానం, కరీంనగర్కు చెందిన పీసీ కె. మల్లేష్ ద్వితీయ స్థానం సాధించారు.
డ్యూటీ మీట్లో ప్రతిభ కనబరిచిన విజేతలందరినీ పోలీస్ కమిషనర్ ప్రత్యేకంగా అభినందించారు. జోనల్ స్థాయిలో ప్రథమ స్థానాలు సాధించిన సిబ్బంది త్వరలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి పోలీస్ డ్యూటీ మీట్లో జోన్-III తరఫున ప్రాతినిధ్యం వహించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఏసీపీలు శ్రీనివాస్ జి., వేణుగోపాల్, వెంకటస్వామి, వివిధ జిల్లాల పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.









