జగిత్యాల: తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలా నడుపుతున్నారని, కాంగ్రెస్ అధిష్టానం ఆయనను సామంత రాజుగా నియమించిందని ఆరోపించారు.
జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతోందని, అందుకే ముఖ్యమంత్రి ఎన్డీఏతో సంబంధాలు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మనుగడ కష్టమని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి స్థానంలో కేసీఆర్ తిరిగి రావాలని ప్రజలు ఆశిస్తున్నారని పేర్కొన్నారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చలేదని విమర్శిస్తూ, “9 నెలల్లో ఫలితాలు కనిపిస్తాయని అన్నారు, కానీ 30 నెలలు గడిచినా మార్పు కనిపించడం లేదు. దీనికి సమాధానం ఎవరు చెబుతారు?” అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం గత 20 నెలలుగా తనను మానసికంగా వేధిస్తోందని ఆరోపించిన జీవన్ రెడ్డి, అందుకే స్వేచ్ఛ కోసం ముందుకు వచ్చానని తెలిపారు. కేసీఆర్ను ఉద్యమ నాయకుడిగా అభివర్ణిస్తూ, తెలంగాణకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి అని కొనియాడారు. అయితే రేవంత్ రెడ్డి పాలనలో ఆ ప్రతిష్ట దెబ్బతిన్నదని అన్నారు.
మరల తెలంగాణ గౌరవాన్ని పునరుద్ధరించేందుకు కేసీఆర్ నాయకత్వంలో ప్రజల కోసం పోరాటం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. రేపటి సభను అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోందని ఆరోపిస్తూ, సభ ప్రకటించగానే రెండు సంవత్సరాలుగా పట్టించుకోని హైవేను తవ్వడం ద్వారా ఆటంకాలు సృష్టిస్తున్నారని విమర్శించారు.
ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.








