పార్వతీపురం / జియమ్మవలస : పార్వతీపురం మన్యం జిల్లాలో నిన్న కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలులతో నష్టపోయిన ప్రాంతాలను జిల్లా కలెక్టర్ డా.ఎన్ ప్రభాకర రెడ్డి శనివారం పరిశీలించారు. జియమ్మవలస మండలం అలమండ గ్రామ పంచాయతీ పరిధిలోని చిన్నతోలుమండ గ్రామాన్ని సందర్శించిన కలెక్టర్, ఈదురుగాలుల కారణంగా దెబ్బతిన్న ఇళ్లు, నేలకూలిన చెట్లు, ప్రభావిత ప్రాంతాలను కురుపాం శాసన సభ్యులు, ప్రభుత్వ విప్ తోయిక జగదీశ్వరితో కలసి ప్రత్యక్షంగా పరిశీలించారు. జిల్లా కలెక్టర్, ప్రభుత్వ విప్ బాధిత కుటుంబాలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. నష్టపోయిన కుటుంబాలకు తక్షణ సహాయం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణతో పాటు అవసరమైన సహాయక చర్యలను వేగవంతం చేయాలని సూచించారు.
ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అధికారులు గ్రామాల్లో నిరంతరం పర్యటిస్తూ పరిస్థితిని పర్యవేక్షించాలని ఆదేశించారు. పర్యటనలో రెవిన్యూ, సచివాలయ అధికారులు సిబ్బంది ఉన్నారు.








