contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

టీడీపీ మేనిఫెస్టో, హామీ పత్రాల దహనం

గుత్తి, జూన్ 4: అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతి రెడ్డి నాయకత్వంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వ విధానాలను విమర్శించారు.

ముందుగా స్థానిక గాంధీ సర్కిల్‌లో ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నైరుతి రెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు.

ప్రత్యేకంగా ‘సూపర్ సిక్స్’ హామీల అమలుపై ప్రశ్నించిన ఆమె, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కేవలం ప్రచార ఆర్భాటానికే పరిమితమయ్యారని విమర్శించారు. రాష్ట్రంలో గత రెండేళ్లుగా ‘వెన్నుపోటు పాలన’ కొనసాగుతోందని ఆమె వ్యాఖ్యానించారు.

వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజల ఆదరణ పొందాయని, కానీ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలుకు నోచుకోలేదని అన్నారు. మహిళలకు, రైతులకు సున్నా వడ్డీ రుణాల అంశంలో ప్రభుత్వం మాట తప్పిందని ఆరోపించారు.

టీడీపీ మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రతి హామీని అమలు చేసే వరకు వైఎస్సార్సీపీ ప్రజల పక్షాన నిలబడి పోరాటం కొనసాగిస్తుందని నైరుతి రెడ్డి స్పష్టం చేశారు.

అనంతరం గాంధీ సర్కిల్ వద్ద కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలకు ప్రతీకగా హామీ పత్రాలు, మేనిఫెస్టో ప్రతులను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :