కరీంనగర్ టౌన్, జూన్ 4: రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా ప్రమాదకరంగా మారిన రహదారులపై గుంతలను స్వయంగా పూడ్చి వాహనదారులకు సురక్షిత ప్రయాణాన్ని కల్పించిన కరీంనగర్ ట్రాఫిక్ పోలీసులను పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ప్రత్యేకంగా అభినందించారు.
నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షాల కారణంగా ఏర్పడిన గుంతలు వాహనదారులకు ఇబ్బందులు కలిగించడమే కాకుండా ప్రమాదాలకు దారితీసే పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ట్రాఫిక్ ఆర్ఎస్ఐ ఎస్. శ్రీకాంత్ తన సిబ్బందితో కలిసి చొరవ తీసుకుని గుంతలను పూడ్చే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ చర్యతో ప్రయాణికులు, వాహనదారులకు ఉపశమనం లభించింది.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం మాట్లాడుతూ, ట్రాఫిక్ నియంత్రణ విధులతో పాటు సామాజిక బాధ్యతను గుర్తించి ప్రజల భద్రత కోసం కృషి చేసిన ఆర్ఎస్ఐ శ్రీకాంత్ సేవలు ప్రశంసనీయమని అన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు, ప్రమాదాలను నివారించేందుకు ఎల్లప్పుడూ అప్రమత్తంగా వ్యవహరిస్తున్న ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది సేవలు ఆదర్శనీయమని కొనియాడారు.
కేవలం విధి నిర్వహణకే పరిమితం కాకుండా ప్రజా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ముందుకు రావడం పోలీసు శాఖకు మంచి పేరు తీసుకువస్తుందని సీపీ పేర్కొన్నారు. రోడ్డు భద్రత విషయంలో ట్రాఫిక్ పోలీసుల కృషి ప్రజలకు మరింత భరోసాను కల్పిస్తోందని తెలిపారు.
ఈ సందర్భంగా ట్రాఫిక్ ఆర్ఎస్ఐ ఎస్. శ్రీకాంత్తో పాటు గుంతల పూడిక కార్యక్రమంలో పాల్గొన్న సిబ్బందిని పోలీస్ కమిషనర్ ప్రత్యేకంగా అభినందించారు.








