మెదక్ జిల్లా, చిన్నశంకరంపేట: ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా చిన్నశంకరంపేట మండలంలోని గజగట్లపల్లి ఎంపీపీఎస్ పాఠశాలలో మంగళవారం సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాల నుంచి మొదటి తరగతిలో పాఠశాలలో చేరిన 12 మంది చిన్నారులకు సంప్రదాయబద్ధంగా అక్షరాభ్యాసం చేయించి విద్యాభ్యాసానికి శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బండారు నాగభూషణం మాట్లాడుతూ, ప్రతి చిన్నారి విద్యకు తొలి అడుగు అక్షరాభ్యాసమేనని, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి ఉన్నత విద్యను అందించాలని సూచించారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి. గాలయ్య మాట్లాడుతూ, విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. విద్యార్థుల సమగ్రాభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కే. రమేష్, ఎం. కవిత, అంగన్వాడీ టీచర్లు వసంత, స్వప్న, పాఠశాల చైర్పర్సన్ తుమ్మల రాణి, గ్రామ పంచాయతీ కార్యదర్శి సంతోష్, తల్లిదండ్రులు, గ్రామస్థులు పాల్గొని చిన్నారులకు ఆశీస్సులు అందించారు. సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది.








