మెట్పల్లి : పోలియో రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జువ్వాడి నర్సింగా రావు పిలుపునిచ్చారు. ఆదివారం మెట్పల్లి పట్టణంలోని యూపీహెచ్సీ సాయిరాం నగర్ కాలనీలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేసి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా జువ్వాడి నర్సింగా రావు మాట్లాడుతూ, దేశ భవిష్యత్తుకు పునాదులైన చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించడం ద్వారా దేశం పోలియో రహిత హోదాను శాశ్వతంగా కొనసాగించవచ్చని పేర్కొన్నారు. ప్రజల సహకారం, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది సమిష్టి కృషితో మెట్పల్లి పట్టణంలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడిందని తెలిపారు.
కార్యక్రమంలో మండల వైద్యాధికారి డా. ఎల్లాల అంజిత్ రెడ్డి, డా. అమరేశ్వర్, డా. వాణి, 4వ వార్డు కౌన్సిలర్ రమేష్, ప్రజాప్రతినిధులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మండల వైద్యాధికారి డా. ఎల్లాల అంజిత్ రెడ్డి మాట్లాడుతూ, ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో ఏవైనా కారణాల వల్ల పోలియో చుక్కలు వేయించుకోలేకపోయిన ఐదేళ్లలోపు చిన్నారులను గుర్తించి, సోమవారం ఇంటింటికీ వెళ్లి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయిస్తామని తెలిపారు. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు అందేలా తల్లిదండ్రులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.








