దామలచెరువు (పాకాల), తిరుపతి జిల్లా : తిరుపతి జిల్లా పాకాల మండలం దామలచెరువు గ్రామంలో గంజాయి, ఇతర మత్తుపదార్థాల నిర్మూలనపై శనివారం తిరుపతి జిల్లా పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల్లో మత్తుపదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలపై చైతన్యం కల్పించేందుకు ప్రత్యేక మొబైల్ పోలీస్ అవేర్నెస్ వ్యాన్ ద్వారా ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు.
చంద్రగిరి ఎస్డీపీఓ (డీఎస్పీ) బేతాల ప్రసాద్ పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గంజాయి, ఇతర మత్తుపదార్థాల వినియోగం వల్ల వ్యక్తులు, కుటుంబాలు, సమాజంపై పడే ప్రతికూల ప్రభావాలను అధికారులు వివరించారు. మత్తుపదార్థాలకు బానిసలైన వారిని గుర్తించేందుకు ఉపయోగించే ప్రత్యేక డ్రగ్ టెస్టింగ్ కిట్ల పనితీరును పరిశీలిస్తూ వాటి వినియోగంపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను పాకాల సర్కిల్ ఇన్స్పెక్టర్ టి. చిన్న గోవిందు పర్యవేక్షించారు. గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని పోలీసుల సూచనలను ఆసక్తిగా విన్నారు.
ఈ సందర్భంగా అధికారులు “పరీక్ష చేద్దాం – మత్తును వదిలిద్దాం” అనే నినాదంతో ప్రజలకు పిలుపునిచ్చారు. గంజాయి లేదా ఇతర నిషేధిత మత్తుపదార్థాల విక్రయాలు, వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు అందించాలని కోరారు. సమాచారం అందించే వ్యక్తుల వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.
మత్తుపదార్థాల రహిత సమాజ నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని, యువతను వ్యసనాల బారిన పడకుండా కాపాడేందుకు ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.








