కాకినాడ – బర్మా కాలనీ : బాలవాక్కు బ్రహ్మవాక్కుతో సమానమనే భావనతో బాలల చేత సామూహికంగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఆరాధన నిర్వహిస్తే ఆ కుటుంబాలు మూడు తరాల పాటు సృష్టి–స్థితి–లయ సమతుల్యతతో శోభిల్లుతాయని స్వయంభువు భోగి గణపతిపీఠం పేర్కొంది. పీఠం 19వ వార్షికోత్సవ కార్యక్రమాల సందర్భంగా ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న ఇంటింటా త్రినాథ వ్రతాల్లో భాగంగా ఆదివారం బర్మా కాలనీలోని పూలే–అంబేద్కర్ కమ్యూనిటీ హాలులో 15వ త్రిదేవి–త్రినాథ వ్రతమేళా ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా బాలలతో త్రినాథ సహస్రనామ పారాయణం, వ్రతకథ పారాయణం నిర్వహించి సామూహికంగా పూజలు చేపట్టారు. మొత్తం 54 కలశాలతో మండపాన్ని అలంకరించగా, 45 కలశాలను ప్రతిష్ఠించి 15 మంది బాలలు చందనం, కుంకుమ, పుష్పాలు, ధూపం, దీపాలతో త్రినాథులకు ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళహారతులు సమర్పించారు.
అన్నదాన సమాజం ట్రస్ట్ సభ్యులు, సీనియర్ సిటిజన్ కోలా ఎల్లారావు–వెంకటలక్ష్మి దంపతులు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి వ్రతమేళా నిర్వహణలో విశేషంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీవారి సేవాసమితి, హరహర మహాదేవ భజన సమాఖ్య, త్రినాథ వ్రత వేదిక సభ్యులు లలితాదేవి స్తోత్ర పారాయణం నిర్వహించారు.
కార్యక్రమం అనంతరం బాలలకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేయడంతో పాటు దత్తాత్రేయ అభిషేక తీర్థప్రసాదం, పంచామృతాలను అందజేశారు. వేద మంత్రోచ్చారణల మధ్య బాలలను ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా గణపతిపీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ, అధికమాసమైన పురుషోత్తమ మాసంలో 12 సంవత్సరాలకు ఒకసారి అదనంగా ఆదివారం రావడం, ఆ పవిత్ర సమయంలో బాలలతో సామూహికంగా సృష్టికర్తల వ్రతపూజలు నిర్వహించే అవకాశం లభించడం దైవానుగ్రహంగా భావిస్తున్నామని తెలిపారు.
వచ్చే ఆదివారం పెద్ద మార్కెట్ ప్రాంతంలో 16వ త్రిదేవి–త్రినాథ వ్రతమేళా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో రేవూరి రామాంజనేయులు, వెంకటలక్ష్మి, మేరేటి శ్రీనివాసరావు, యశ్వంత్ రాజ్ కుమార్, సాయి కార్తికేయ, హర్షిణి, నాగేంద్ర, మధు, వరలక్ష్మి, గౌరి, జగదాంబ, అశ్వనీతో పాటు మనోహర్, అఖిల్, పర్ణికశ్రీ, రేష్మిక, మహర్షి, హాసిని, ఆదిత్య, అరుణ్, తులసి, శివ, దుర్గ, సాయి వికాస్, నవనీత్, దేవి, ఉమా, మహేష్, మాధవ్, లోకేష్ తదితర బాలలు పాల్గొన్నారు.








