మెదక్ జిల్లా మాసాయిపేట మండలం రామంతాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని లింగరెడ్డిపల్లి గ్రామం నుంచి చిన్నచిన్నూర్ మీదుగా చేగుంట, గజ్వేల్, సిద్దిపేట ప్రాంతాలను కలిపే లింక్ రోడ్డు దశాబ్దకాలంగా అధ్వాన్నంగా మారిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహదారి మొత్తం కంకర, గుంతలతో నిండిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
ఈ రహదారి సిద్దిపేట–నిజాంబాద్ ప్రాంతాలకు షార్ట్కట్ మార్గంగా ఉండటంతో ప్రతిరోజూ ద్విచక్ర వాహనాలు, కార్లు, ట్రాక్టర్లు, లారీలు అధిక సంఖ్యలో రాకపోకలు సాగిస్తుంటాయి. అయితే రోడ్డు పూర్తిగా దెబ్బతినడంతో ముఖ్యంగా రాత్రి వేళల్లో గుంతలు కనిపించక పలువురు వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని స్థానికులు పేర్కొన్నారు.
గత పదేళ్లుగా రోడ్డు మరమ్మతులు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు సమస్యను పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపించారు. గతంలో పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లినా శాశ్వత పరిష్కారం లభించలేదని తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల పరిస్థితిని అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, ప్రమాదాలకు కారణమవుతున్న దెబ్బతిన్న రోడ్లను వెంటనే అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారు.








