పిడుగురాళ్ల : పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం జానపాడు గ్రామంలో పోలీసులు గురువారం తెల్లవారుజామున విస్తృతంగా కార్డన్ అండ్ సెర్చ్ (Cordon and Search) నిర్వహించారు. గ్రామంలోని పలు ప్రాంతాల్లో ఒకేసారి తనిఖీలు చేపట్టిన పోలీసులు అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు, నేర చరిత్ర కలిగిన వ్యక్తులపై ప్రత్యేక దృష్టి సారించారు.
ఈ సందర్భంగా ఇళ్ల వద్ద ధ్రువపత్రాలు, వాహనాల రిజిస్ట్రేషన్ పత్రాలు, అనుమానాస్పద వస్తువులు, చట్టవిరుద్ధ కార్యకలాపాలపై పోలీసులు క్షుణ్నంగా తనిఖీలు చేపట్టారు. గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, నేరస్తుల కదలికలపై నిఘా పెంచే లక్ష్యంతో ఈ కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
ప్రజలు పోలీసులకు సహకరించాలని, గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని పోలీసులు సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఇటువంటి కార్డన్ సెర్చ్ కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు.








