తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పవిత్రతను పరిరక్షించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని తెలుగుదేశం పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జే.బీ. శ్రీనివాస్ తెలిపారు. తిరుపతిలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో తిరుమలను దళారీల అడ్డాగా మార్చారని ఆరోపించారు. ప్రస్తుతం అదే పార్టీ నాయకులు తిరుమల పవిత్రతపై మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు.
స్విమ్స్లో ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయగానే, ఉద్యోగాలను బంధువులకే కట్టబెడుతున్నారంటూ విపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. గతంలో డీఎస్సీ నోటిఫికేషన్ సమయంలో కూడా ఇలాంటి ఆరోపణలే చేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకూడదనే ఉద్దేశంతోనే విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు.
గత ప్రభుత్వం యువతను ఎన్నికలు, రౌడీయిజం వంటి కార్యకలాపాలకు మాత్రమే ఉపయోగించుకుందని, వారి ఉపాధి, భవిష్యత్తు కోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ దేశ విదేశాల్లో పెట్టుబడులను ఆకర్షించి రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకొస్తుంటే, విపక్షాలు అభివృద్ధికి ఆటంకాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు.
గత ఐదేళ్లలో స్థానిక తిరుపతి ప్రజలకు కనీసం శ్రీవారి దర్శనం కూడా సక్రమంగా కల్పించలేకపోయారని, టీటీడీలో దళారీ వ్యవస్థను ప్రోత్సహించారని ఆరోపించారు. ప్రస్తుతం అర్హులైన నిరుద్యోగులకు పారదర్శకంగా ఉద్యోగాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. విపక్షాలు తప్పుడు ప్రచారాన్ని మానుకుని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
ఎన్నికల వ్యవస్థను ప్రక్షాళన చేసే క్రమంలో తిరుపతి నియోజకవర్గంలో గత ప్రభుత్వం చేర్చిన లక్షలాది అక్రమ ఓట్లను పూర్తి ఆధారాలతో, నిబంధనల ప్రకారం తొలగించామని జే.బీ. శ్రీనివాస్ వెల్లడించారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు న్యాయం చేయడం, తిరుమల దివ్యత్వాన్ని పరిరక్షించడం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు.








