తిరుపతి : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో సనాతన వేద ధర్మ పరిరక్షణ లక్ష్యంగా స్థాపించబడిన శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో నెలకొన్న పరిపాలనా వ్యవహారాలు, నిధుల వినియోగం, నియామకాలపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. విశ్వవిద్యాలయానికి కొత్త వైస్ ఛాన్సలర్ (వీసీ) నియామకం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది.
వేద విశ్వవిద్యాలయంలో అక్రమాలు, అవినీతి, బంధుప్రీతి, పరిపాలనా లోపాలు చోటుచేసుకుంటున్నాయంటూ వేద పండితులు, బోధన, బోధనేతర సిబ్బంది తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుత వైస్ ఛాన్సలర్ రాణి సదాశివమూర్తి, రిజిస్ట్రార్ బలభద్ర ఉపాధ్యాయలను వెంటనే బాధ్యతల నుంచి తొలగించి, విశ్వవిద్యాలయ వ్యవహారాలపై సమగ్ర విజిలెన్స్ విచారణ చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ఈ అంశాలపై జూలై 24న రిపోర్టర్ టీవీ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. వేద విశ్వవిద్యాలయంలో జరుగుతున్న పరిపాలనా లోపాలు, ఆరోపణలపై ప్రభుత్వం, టీటీడీ యంత్రాంగం వెంటనే జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆ కథనంలో ప్రస్తావించబడింది.
ఈ నేపథ్యంలో టీటీడీ కొత్త వైస్ ఛాన్సలర్ నియామకానికి అధికారిక నోటిఫికేషన్ జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కొత్త వీసీ నియామకం ద్వారా విశ్వవిద్యాలయంలో నెలకొన్న వివాదాలకు ముగింపు పలికి, పారదర్శక పరిపాలనకు మార్గం సుగమం అవుతుందని వేద పండితులు, ఉద్యోగులు, విద్యార్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
అయితే, కేవలం కొత్త వీసీ నియామకంతో సరిపెట్టకుండా, విశ్వవిద్యాలయంపై వచ్చిన ఆరోపణలన్నింటిపైనా సమగ్ర, నిష్పక్షపాత విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సంబంధిత వర్గాలు ప్రభుత్వాన్ని, టీటీడీని కోరుతున్నాయి.
శ్రీ వేంకటేశ్వర వేద వర్శిటీలో అరాచక పాలన: వీసీ, రిజిస్ట్రార్ల తొలగింపుకు డిమాండ్!








