జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో శుక్రవారం బోనాల పండుగను సంప్రదాయబద్ధంగా, భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు పరిచయం చేయాలనే లక్ష్యంతో నిర్వహించిన ఈ వేడుకల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
పాఠశాల విద్యార్థులు అమ్మవారు, పోతారాజుల వేషధారణలో పాఠశాల నుంచి త్రిశక్తి అమ్మవారి ఆలయం వరకు శోభాయాత్ర నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించడంతో పాటు బోనాలు సమర్పించి అమ్మవారిని ప్రార్థించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన బోనాల నృత్యాలు, సాంప్రదాయ కళారూపాలు హాజరైన వారిని విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్, ప్రధానాచార్యులు పూజ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతిలో బోనాల పండుగకు విశిష్ట స్థానం ఉందన్నారు. ఈ పండుగ వెనుక ఉన్న ఆధ్యాత్మికత, సంప్రదాయాల గొప్పతనాన్ని చిన్నారులకు తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం పాఠశాలలో బోనాల వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మన పండుగల విశిష్టతను చిన్నప్పటి నుంచే పిల్లలకు పరిచయం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.
వర్షాకాలంలో వచ్చే అంటువ్యాధులు తొలగిపోయి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని గ్రామదేవతలకు బోనం సమర్పించడం అనాదిగా వస్తున్న ఆచారమని ఆమె వివరించారు. రాష్ట్ర ప్రజలు సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, సుభిక్షాలతో జీవించాలని కోరుతూ బోనాల పండుగను నిర్వహిస్తారని చెప్పారు.
ఈ కార్యక్రమంలో శ్రీ సరస్వతి శిశు మందిర్ అధ్యక్షుడు లక్ష్మణ్, ఆర్ఎస్ఎస్ జిల్లా కుటుంబ ప్రబోధన్ ప్రముఖ్ గంగాధర్, సరస్వతి శిశు మందిర్ జగిత్యాల జిల్లా సభ్యుడు గౌతమ్, ప్రధానాచార్యులు పూజ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థినులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని బోనాల సంబరాలను విజయవంతం చేశారు.








