contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

పిడిగురునాళ్ల సిఐ వెంకట్ రావు వేధింపులు – వైసిపి నాయకుడు ఆత్మహత్యాయత్నం

పిడుగురాళ్ల, పల్నాడు జిల్లా: పిడుగురాళ్ల పట్టణ 22వ వార్డు కౌన్సిలర్ జడ సురేంద్ర ఆత్మహత్యాయత్నం ఘటన పల్నాడు జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం పల్నాడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సురేంద్రను మీడియా ప్రతినిధులు కలవగా, తన ఆత్మహత్యాయత్నానికి దారితీసిన పరిస్థితులపై సంచలన ఆరోపణలు చేశారు.

మీడియాతో మాట్లాడిన సురేంద్ర మాట్లాడుతూ, తాను రెండేళ్ల క్రితం కొనుగోలు చేసిన రెస్టారెంట్‌కు సంబంధించి ఇప్పటికే రూ.30 లక్షలు చెల్లించినప్పటికీ, నల్లాటి సుబ్బారావు అనే వ్యక్తి మరింత డబ్బు ఇవ్వాలని నిరంతరం ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. తాను చెల్లించిన డబ్బులకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు, ఇతర ఆధారాలు తన వద్ద ఉన్నాయని, వాటిని పోలీసులకు కూడా చూపించినట్లు తెలిపారు.

అయినప్పటికీ తన మాటను ఎవరూ పట్టించుకోలేదని, రూ.75 లక్షలు అదనంగా చెల్లించాలని డిమాండ్ చేస్తూ వేధింపులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని పిడుగురాళ్ల సీఐ వెంకట్రావు దృష్టికి తీసుకెళ్లానని, అన్ని ఆధారాలు సమర్పించినప్పటికీ తనకు న్యాయం జరగలేదని వాపోయారు.

వాటాదారులకు సంబంధించిన చెల్లింపులు ఇప్పటికే పూర్తయ్యాయని, వివాదంపై చర్చలు కొనసాగుతున్నాయని చెప్పినా, నల్లాటి సుబ్బారావు తనపై ఒత్తిడి కొనసాగించాడని సురేంద్ర ఆరోపించారు. మట్టారెడ్డి అనే వ్యక్తి అందుబాటులో లేని కారణంగా కొంత సమయం ఇవ్వాలని కోరినా వినిపించుకోలేదని తెలిపారు.

పది రోజుల తర్వాత తనను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి, మట్టారెడ్డి చెల్లించాల్సిన డబ్బులను కూడా తన నుంచే వసూలు చేయాలని ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. ఈ మానసిక ఒత్తిడిని తట్టుకోలేక మరోసారి రూ.10 లక్షలు చెల్లించినట్లు వెల్లడించారు. అయినప్పటికీ వేధింపులు ఆగలేదని, తరచూ స్టేషన్‌కు పిలిపిస్తూ మరింత డబ్బు ఇవ్వాలని ఒత్తిడి చేశారని చెప్పారు.

ఈ సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు తన మనోధైర్యాన్ని పూర్తిగా దెబ్బతీశాయని సురేంద్ర పేర్కొన్నారు. “రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు, మాకు కూడా మంచి రోజులు వస్తాయి” అని తాను చెప్పగా, తనను ఎవరూ ఏమీ చేయలేరని, తాను చట్టానికి అతీతుడినన్నట్లుగా మాట్లాడారని ఆరోపించారు.

తనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారని,  కుటుంబానికి ద్రోహం చేయడం కంటే చనిపోవడానికైనా సిద్ధమని భావించి ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నానని సురేంద్ర భావోద్వేగంతో వెల్లడించారు.

ఇక ఈ ఘటనపై పలు ప్రజాసంఘాలు, స్థానిక నాయకులు, సామాజిక వర్గాల ప్రతినిధులు స్పందిస్తూ పూర్తి స్థాయి నిష్పక్షపాత విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. ఆత్మహత్యాయత్నానికి దారితీసిన పరిస్థితులు ఏమిటి, ఆరోపణల్లో ఎంతవరకు నిజం ఉందనే అంశాలపై ఉన్నతాధికారులు విచారణ జరిపి వాస్తవాలను వెలికితీయాలని కోరుతున్నారు.

ప్రస్తుతం జడ సురేంద్ర ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. మరోవైపు ఆయన చేసిన ఆరోపణలపై సంబంధిత వ్యక్తులు, పోలీసు అధికారులు అధికారికంగా స్పందించాల్సి ఉంది.

గమనిక: ఈ కథనంలో పేర్కొన్న అంశాలు జడ సురేంద్ర మీడియా ముందు చేసిన ఆరోపణల ఆధారంగా రూపొందించబడ్డాయి. ఆరోపణలపై సంబంధిత వ్యక్తులు, అధికారులు స్పందించాల్సి ఉంది. విచారణ అనంతరం పూర్తి వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :