ఛత్తీస్గఢ్: మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలిందనుకోవచ్చు. నారాయణపూర్-బీజాపూర్-దంతెవాడ జిల్లాల సరిహద్దులో ఉన్న అడవుల్లో భద్రతా దళాలతో జరిగిన భారీ ఎన్ కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత, నంబాళ్ల కేశవరావు సహా 27 మంది మావోయిస్టులు మృతి చెందారు. ప్రధాన కార్యదర్శి స్థాయి నేత ఎన్కౌంటర్లో మరణించడం 30 ఏళ్లలో తొలిసారని కేంద్రం హోంమంత్రి అమిత్ షా ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
మాధ్ ప్రాంతంలో పెద్దఎత్తున మావోయిస్టులు ఉన్నట్టు సమాచారం అందడంతో బీజాపూర్, నారాయణపూర్, దంతేవాడ DRG బలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలోనే మావోయిస్టులు తారసపడి కాల్పులు జరపడం వల్ల భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపాయి. ఈ ఎన్ కౌంటర్ లో 28 మంది మవోయిస్టులు మరణించినట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ ఎదురు కాల్పుల్లో పోలీసు సహాయకుడు ఒకరు మృతి చెందినట్లు చత్తీస్గఢ్ హోంమంత్రి విజయ్ వర్మ తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన జవానుకు ప్రాణాపాయం లేదని వెల్లడించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఉదయం నుంచి భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య భారీగా ఎదురు కాల్పులు జరుగుతున్నట్టు సమచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
నంబాల కేశవరావుపై రూ.1.5కోట్ల రివార్డు
ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మరణించారు. బసవరాజు ఉన్నారన్న సమాచారంతో మాధ్ ప్రాంతాన్ని బలగాలు చుట్టుముట్టినట్టు తెలుస్తోంది. నంబాల కేశవరావుపై కోటిన్నర రివార్డు ఉందని పోలీసులు తెలిపారు. గణపతి రాజీనామాతో పార్టీకి సుప్రీం కమాండర్ బాధ్యతలను నంబాల కేశవరావు నిర్వహించారు. నంబాల కేశవరావు స్వస్థలం శ్రీకాకుళం జిల్లా జియ్యన్నపేట. తూర్పు గోదావరి, విశాఖలో మావోయిస్టు పార్టీలో పనిచేశారు. పీపుల్స్వార్ వ్యవస్థాపకుల్లో నంబాల కేశవరావు ఒకరు. మావోయిస్టు సెంట్రల్ మిలిటరీ కమిషన్ అధిపతిగా నంబాల కేశవరావు పనిచేశారు.
వరంగల్ ఆర్ఈసీలో నంబాల కేశవరావు ఇంజినీరింగ్ చదివారు. ఆయన తండ్రి ఉపాధ్యాయుడు. 1984లో ఎంటెక్ చదువుతూ పీపుల్స్ వార్ సిద్ధాంతల పట్ల నంబాల కేశవరావు ఆకర్షితులయ్యారు. గెరిల్లా యుద్ధం, ఐఈడీ పేలుడు పదార్థాల వినియోగంలో మావోయిస్టు పార్టీకి మూలస్తంభంగా ఉన్నారు. 1987లో బస్తర్ అడవుల్లో మాజీ ఎల్టీటీఈ, మాజీ సైనికుల వద్ద శిక్షణ తీసుకున్నారు. 2018 నవంబర్లో గణపతి రాజీనామా తర్వాత మావోయిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నంబాల బాధ్యతలు చేపట్టారు. 2010లో ఛత్తీస్గఢ్లో 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల మృతి ఘటనకు నంబాల కేశవరాలు సూత్రధారిగా ఉన్నారు.