ఇటీవల కాలంలో చమురు, ఎల్పీజీ సరఫరాలో ఏర్పడిన అనిశ్చితి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రపంచ దేశాలకు ఇరాన్ ఊరటనిచ్చే వార్తను ప్రకటించింది. అంతర్జాతీయ వాణిజ్యానికి కీలకంగా భావించే హార్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. హార్ముజ్ మార్గాన్ని పూర్తిగా తెరిచినట్లు అధికారికంగా వెల్లడించింది.
లెబనాన్లో కొనసాగుతున్న కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉన్నంత కాలం, ఈ జలసంధి గుండా అన్ని రకాల వాణిజ్య నౌకల రాకపోకలకు అనుమతి ఉంటుందని ఇరాన్ స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చీ శుక్రవారం అధికారిక ప్రకటనలో వెల్లడించారు.
మంత్రి మాట్లాడుతూ, “లెబనాన్లో అమలవుతున్న కాల్పుల విరమణ ఒప్పందానికి అనుగుణంగా, ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ పోర్ట్స్ అండ్ మారిటైమ్ ఆర్గనైజేషన్ సూచించిన సమన్వయ మార్గంలో, మిగిలిన విరమణ కాలానికి హార్ముజ్ జలసంధి గుండా అన్ని వాణిజ్య నౌకల ప్రయాణానికి మార్గం పూర్తిగా తెరిచి ఉంటుంది” అని తెలిపారు.
ప్రపంచ చమురు వాణిజ్యంలో హార్ముజ్ జలసంధి అత్యంత వ్యూహాత్మక ప్రాధాన్యత కలిగిన మార్గం. ఇటీవల ఈ ప్రాంతంలో పెరిగిన ఉద్రిక్తతల కారణంగా సరఫరా గొలుసులు ప్రభావితమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ తీసుకున్న తాజా నిర్ణయం అంతర్జాతీయ వాణిజ్య వర్గాలకు గణనీయమైన ఊరటను కలిగిస్తోంది.
అయితే, నౌకలు ఇరాన్ మారిటైమ్ సంస్థ నిర్దేశించిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని కూడా స్పష్టం చేసింది. లెబనాన్లో శాంతియుత పరిస్థితులు కొనసాగేందుకు మద్దతు ఇవ్వడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.








