కరీంనగర్ జిల్లా: భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లో నేడు వేడుకలను అత్యంత గౌరవప్రదంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం కమిషనరేట్ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ, ఆధునిక భారతదేశ నిర్మాణంలో అంబేద్కర్ చేసిన కృషి అనన్యసామాన్యమని కొనియాడారు. సమానత్వం, న్యాయం, సౌభ్రాతృత్వం ప్రాతిపదికగా సమాజాన్ని నిర్మించేందుకు ఆయన చేసిన నిరంతర పోరాటం అందరికీ ఆదర్శమని తెలిపారు.
అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పోలీస్ యంత్రాంగం ఎల్లప్పుడూ రాజ్యాంగ విలువలను కాపాడాలని కమిషనర్ గౌష్ ఆలం స్పష్టం చేశారు. ప్రతి పౌరుడికి, ముఖ్యంగా అణగారిన వర్గాలకు న్యాయం జరిగేలా చూడటం మన బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజా సేవకులు అంబేద్కర్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని చిత్తశుద్ధితో, సామాజిక స్పృహతో విధులు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కమిషనరేట్కు చెందిన అడిషనల్ డీసీపీ వెంకటరమణ, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు రజినీకాంత్, జానిమియా, కిరణ్ కుమార్, ఇన్స్పెక్టర్ సరిలాల్, సబ్ ఇన్స్పెక్టర్లు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.









