కరీంనగర్ జిల్లా: పోలీస్ సిబ్బంది సంక్షేమం మరియు వారి వసతి సౌకర్యాలను మెరుగుపరిచే లక్ష్యంతో, కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం బుధవారం నాడు హుజూరాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో నూతనంగా నిర్మించిన “అమరవీరుల స్మారక బ్యారక్ సిబ్బంది విశ్రాంతి భవనాన్ని” (Martyrs Memorial Barrack Building) ప్రారంభించారు.
ఈ సందర్భంగా పోలీసు కమీషనర్ మాట్లాడుతూ, విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, వారి గౌరవార్థం ఈ భవనాన్ని నిర్మించినట్లు తెలిపారు. నిరంతరం ప్రజల రక్షణ కోసం శ్రమించే పోలీస్ సిబ్బందికి మెరుగైన వసతి, మౌలిక సదుపాయాలు కల్పించడం వల్ల వారు మరింత ఉత్సాహంతో విధులు నిర్వహిస్తారని ఆయన పేర్కొన్నారు. సిబ్బంది ఆరోగ్యం మరియు సౌకర్యాల విషయంలో రాజీ పడకుండా, జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో పని వాతావరణాన్ని ఆధునీకరిస్తామని సీపీ హామీ ఇచ్చారు. తగిన వసతి సౌకర్యాలు ఉన్నప్పుడే అధికారులు అత్యవసర సమయాల్లో మరియు ప్రజలకు సేవ చేయడంలో మరింత సమర్థవంతంగా పనిచేయగలరని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.
ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ ఏసీపీ వి.మాధవి, స్థానిక ఇన్స్పెక్టర్లు కరుణాకర్, శ్రీనివాస్, రామకృష్ణ, ఎస్సైలు ఆవుల తిరుపతి, స్వాతి, క్రాంతి లతో పాటు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.









