మెదక్ జిల్లా – తూప్రాన్ : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా తూప్రాన్ మండలంలోని పలు గ్రామాల్లో గురువారం గ్రామసభలు నిర్వహించారు. గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
దాతర్పల్లి గ్రామంలో నిర్వహించిన గ్రామసభకు ఆర్డీఓ, తూప్రాన్ తహసీల్దార్ (ఎమ్మార్వో), వ్యవసాయ అధికారి (ఏవో) హాజరయ్యారు. గ్రామస్తుల సమస్యలు, అభ్యర్థనలు, అభివృద్ధి అవసరాలను నేరుగా తెలుసుకుని సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించారు.
అదేవిధంగా తూప్రాన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది మండలంలోని మూడు గ్రామాల్లో నిర్వహించిన గ్రామసభలకు హాజరై ప్రజలతో మమేకమయ్యారు. గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణ, సైబర్ నేరాల నివారణ, మహిళల భద్రత, రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ, సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అపరిచిత వ్యక్తులకు వ్యక్తిగత, బ్యాంకు వివరాలు వెల్లడించవద్దని హెచ్చరించారు. అలాగే మహిళల భద్రత కోసం ప్రభుత్వం, పోలీసు శాఖ అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు సీటుబెల్ట్ వినియోగించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, అలాంటి చర్యలకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు.
గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, భద్రతా అంశాలపై నిర్వహించిన ఈ గ్రామసభలకు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.








