ఎపి లోని ప్రకాశం జిల్లా, మార్కాపురం రైల్వే స్టేషన్ లో ప్రయాణికులు లిఫ్ట్ లో ఇరుక్కుపోయారు. పరిమితికి మించి జనం ఎక్కడంతో లిఫ్ట్ మధ్యలోనే ఆగిపోయింది. డోర్లు తెరుచుకోక, బయటకు వచ్చే మార్గం లేక ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. దాదాపు 3 గంటల పాటు లోపలే ఉండడంతో మహిళలు, పిల్లలు భయంతో కేకలు వేశారు. ప్రయాణికుల కేకలు విని రైల్వే పోలీసులు స్పందించారు.
టెక్నీషియన్లు అందుబాటులో లేకపోవడంతో పోలీసులే స్వయంగా రంగంలోకి దిగారు. లిఫ్ట్ పైనుంచి లోపలికి దిగి, ఎమర్జెన్సీ మార్గంలో ప్రయాణికులను బయటకు తీసుకువచ్చారు. లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన 14 మందిని క్షేమంగా బయటకు తెచ్చారు. లిఫ్ట్ లో చిక్కుకుపోయిన ప్రయాణికులు తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరిగి ఇంటికి వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.