చిన్నశంకరంపేట : మెదక్ జిల్లా నార్సింగి మండలం జప్తి శివునూర్ వద్ద మాజీ మంత్రి, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీకి చెందిన గెస్ట్హౌస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. గెస్ట్హౌస్ చుట్టూ నిర్మిస్తున్న కాంపౌండ్ వాల్ తమ వ్యవసాయ పొలాలకు వెళ్లే దారిని మూసివేస్తోందని ఆరోపిస్తూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు.
జాతీయ రహదారి పక్కన ఉన్న గెస్ట్హౌస్ వద్ద నిర్మాణంలో ఉన్న కాంపౌండ్ వాల్లో కొంత భాగాన్ని గ్రామస్తులు కూల్చివేశారు. ఏళ్లుగా ఇదే మార్గం ద్వారా తమ వ్యవసాయ భూములకు రాకపోకలు సాగిస్తున్నామని వారు తెలిపారు. గోడ నిర్మాణం పూర్తయితే పొలాలకు వెళ్లేందుకు దారి లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయాన్ని గతంలోనే సంబంధిత వ్యక్తుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ తమ అభ్యంతరాలను పట్టించుకోకుండా కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులు కొనసాగించారని గ్రామస్తులు ఆరోపించారు. దీంతో ఆగ్రహానికి గురైన వారు గోడను కూల్చినట్లు తెలిపారు.
తమ వ్యవసాయ భూములకు రాకపోకలు సాగించే దారిని ఎట్టి పరిస్థితుల్లోనూ మూసివేయవద్దని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. సమస్యపై అధికారులు వెంటనే స్పందించి, ఇరువర్గాలతో చర్చించి దారి విషయంలో స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. సంఘటన నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.








