- భూమిని ఎవరు కొనరాదు – అమ్మరాదు
- లబ్ధిదారు, వారసులే అనుభవించే హక్కు
- స్పష్టం చేస్తున్న పీవోటీ చట్టం – 1977
హైదరాబాద్ : హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో భూములను ఆక్రమించే పనిలో కొందరు బిజీగా ఉన్నారు. ప్రభుత్వాన్ని ఇటు కోర్టులను తప్పుదోవ పట్టిస్తూ భూములను యధేచ్చగా కబ్జా చేస్తున్నారు. అసైన్డ్ భూములను ఎవరైనా ఆక్రమించినా, కొనుగోలు చేసినా ఆరు నెలల జైలు శిక్ష తప్పదని అసైన్డ్ భూముల బదలాయింపు చట్టం (పీవోటీ ) – 1977 స్పష్టం చేస్తుంది. భూమి లేని నిరుపేదలకు ప్రభుత్వం సాగు చేసుకునేందుకు, లేదా ఇంటి నిర్మాణానికి ఇచ్చిన భూమిని అసైన్డ్ భూమిగా పేర్కొంటారు. ఈ భూమి లబ్ధిదారు, వారి వారసులకు వారసత్వంగా అనుభవించడానికి మాత్రమే హక్కు ఉంటుంది. ఇతరుల పేర్ల మీదికి బదలాయించడం, అమ్మడం, దానం ఇవ్వడం, కౌలుకు ఇవ్వడాన్ని పీవోటీ – 1977 చట్టం నిషేధిస్తుంది. ఒకవేళ ఎవరైనా అసైన్డ్ భూములను కొన్నా ఈ చట్టం ప్రకారం వారికి ఎలాంటి హక్కులు దాఖలు పడవు. ప్రభుత్వం ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవచ్చు. అసైన్డ్ భూములను కొనుగోలు చేయడం చట్టప్రకారం నేరం. అది అసైన్డ్ భూమి అని కోర్టు తేల్చినా, ఆక్రమణలు కొనసాగిస్తే శిక్షార్హం అవుతుంది. కోర్టు గరిష్టంగా ఆరు నెలల వరకు జైలు శిక్ష లేదా రూ.2000 /- వరకు జరిమానా లేదా రెండు శిక్షలు కలిపి వేయవచ్చు.