- అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు నిరసన కార్యక్రమం
కర్నూల్ : మైనర్ బాలికపై అత్యాచార ప్రయత్నం కేసులో ఒకటవ పట్టణ పోలీసుస్టేషన్ సి.ఐ. నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ యస్సీ యస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ మౌన నిరసన ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. నిరసన మౌన ధర్నాలో మహిళా ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మీ, సమాచారం హక్కు చట్టం నాయకులు నాయకంటి జయన్న లు పాల్గొన్నారు. బాధిత మహిళలతో కలిసి ధర్నాలో పాల్గొన్న పట్నం రాజేశ్వరి మాట్లాడుతూ ఒకటవ పట్టణ పోలీసుస్టేషన్ పరిధిలోని సున్నపువీధిలో ఉన్నటువంటి మైనర్ అమ్మాయిపై అత్యాచార యత్నం చేసి ఆపై దాడి చేసి చంపడానికి ప్రయత్నించినటువంటి నిందితులను అరెస్టు చేయాలని యస్సీ యస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి డిమాండ్ చేశారు. సంఘటన జరిగి దాదాపు నెల రోజులు దాటినా ఇంతవరకు నిందితులపై చర్యలు చేపట్టని ఒకటవ పట్టణ పోలీసుస్టేషన్ సి.ఐ ఆంతర్యం ఏమిటని ఆమె ప్రశ్నించారు. ధర్నా జరుగుతుండగా మూడవ పట్టణ పోలీసుస్టేషన్ సి.ఐ. తబ్రేజ్ గారు వచ్చి బాధిత మైనర్ బాలిక స్టేట్మెంట్ ను రికార్డు చేసి తిరిగి కేసు నమోదు చేస్తామని చెప్పారు. చెప్పినట్లే వెంటనే బాధితురాలి స్టేట్మెంట్ రికార్డు చేయడం జరిగిందని ఆమె తెలిపారు. మహిళా పోక్సో చట్టాన్ని నీరుగార్చే ప్రయత్నం చేసిన సి.ఐ పై జిల్లా పోలీసు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు. స్టేషన్ కు వెళ్లిన బాధిత మహిళల పట్ల పోలీసుల ప్రవర్తన సరిగ్గా లేదని, మహిళలను కనీసం గౌరవించకుండా, వారి సమస్యను వినకుండా అవమానించడం సరైనది కాదని ఆమె అన్నారు. మహిళా ఫిర్యాదులు పట్ల స్టేషన్ హౌస్ ఆఫీసర్ల ప్రవర్తనపై కర్నూలు జిల్లా ఎస్పీ గారు కర్నూల్ రేంజ్ డీఐజీ గారు దృష్టి సారించి న్యాయం జరిగేలా చూడాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో దేవీబాయి,భారతమ్మ భాను,ఎలీషమ్మ , ఆకుతోట పద్మావతి, హుస్సేన్ బీ, ఈరమ్మ, రాధ, పెద్దక్క, ఖాసింబీ, దస్తగిరమ్మ, సరోజ, ఈశ్వరమ్మ,వీణ, రేవతి, లక్ష్మీదేవి, తదితరులు పాల్గొన్నారు.