తిరుపతి రూరల్ : ప్రజల సంక్షేమం, అవసరాలే ప్రధాన ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, ఆ దిశగా నీటి వనరుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టామని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు. తిరుపతి రూరల్ మండలం పేరూరు చెరువు వద్ద జలవనరుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన “నీటి సంరక్షణకు – సుస్థిర ఆంధ్రకు మార్గం” కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఆర్డీవో రామ్మోహన్లతో కలిసి చెరువు పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వాగులు, వంకలు, చెరువులు అనేక కబ్జాలకు గురయ్యాయని ఆయన విమర్శించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాగునీటి సంఘాలను బలోపేతం చేస్తూ, భూగర్భ జల మట్టాలను పెంచేందుకు పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో ఓ ఆసక్తికర దృశ్యం ఆకట్టుకుంది. ఎమ్మెల్యే పులివర్తి నాని స్వయంగా ద్విచక్ర వాహనం నడుపుతూ, జిల్లా కలెక్టర్ను వెనుక కూర్చోబెట్టుకుని పేరూరు చెరువుకట్టను పరిశీలించారు. చెరువు కట్ట సంరక్షణ, నీటి నిల్వల పెంపుపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
వ్యవసాయానికి, తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నీటి నిల్వలను పెంచడం ఈ 100 రోజుల కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే వివరించారు. రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు, రైతులు ఇబ్బందులు పడకుండా ముందస్తు జాగ్రత్తలతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు.
“చెరువులు, నీటి కుంటలను కబ్జాల నుండి కాపాడుకుంటూ, నీటి వనరులను అభివృద్ధి చేయడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం” అని ఎమ్మెల్యే పులివర్తి నాని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ అధికారులు, సాగునీటి సంఘాల ప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.








