కరీంనగర్ జిల్లా, శంకరపట్నం మండలం తాడికల్ శివారులో శనివారం సాయంత్రం సుమారు 4:30 గంటల సమయంలో తీవ్ర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
హుజురాబాద్ నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న TS12 UD 0999 నంబర్ గల లారీకి అకస్మాత్తుగా బ్రేకులు ఫెయిల్ కావడంతో అతి వేగంగా దూసుకొచ్చింది. ఈ క్రమంలో కరీంనగర్ నుంచి హుజురాబాద్ వైపు వెళ్తున్న TS 02 UC 5969 నంబర్ గల ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. అనంతరం అదే లారీ మరో లారీని కూడా ఢీకొనడంతో తీవ్ర ప్రమాదం చోటుచేసుకుని లారీ బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో రెండు లారీల డ్రైవర్లతో పాటు బస్సులో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను కరీంనగర్ మరియు హుజురాబాద్ ఆసుపత్రులకు తరలించారు.
ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.








