జియ్యమ్మవలస : అన్నదాతకు అండగా నిలవాల్సిన సాగునీటి కాలువ, అధికారుల నిర్లక్ష్యం కారణంగా మురుగు కూపంగా మారింది. పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలంలోని రావాడ వట్టిగెడ్డ రిజర్వాయర్ ఐదవ బ్రాంచ్ ప్రధాన కాలువ ప్రస్తుతం చెత్తాచెదారంతో నిండిపోయి డ్రంపింగ్ యార్డ్ను తలపిస్తోంది.
ప్రధానంగా పెదమేరింగి సెంటర్ వద్ద ఉన్న కల్వర్టు పూర్తిగా వ్యర్థాలతో కూరుకుపోవడంతో సాగునీటి సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ప్లాస్టిక్ వ్యర్థాలు, గృహ వినియోగ చెత్త పేరుకుపోవడంతో నీటి ప్రవాహం నిలిచిపోతోంది.
ఈ ఐదవ బ్రాంచ్ కాలువ అత్యంత కీలకమైనది. ఇది నేరుగా గౌరీ సాగరం చెరువుకు నీటిని చేరవేసి, అక్కడి నుండి పెదమేరింగి, గవరంపేట, వెంకటాపురం, బాసింగి, చింతల బెలగం, గిజబా వంటి గ్రామాలకు చెందిన వేలాది ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. ప్రస్తుతం ఈ కాలువలో చెత్త పేరుకుపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇంకా, రైతులు తమ పొలాలకు వెళ్లేందుకు ఈ కాలువ గట్టునే ప్రధాన దారిగా ఉపయోగిస్తారు. అయితే, ఇటీవలి కాలంలో ఇక్కడ విచ్చలవిడిగా చెత్త పారబోసడం వల్ల అది కుళ్లిపోయి తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. “పొలాలకు వెళ్లాలంటే ముక్కు మూసుకోవాల్సి వస్తోంది. ఈ అపరిశుభ్రత వల్ల రోగాల బారిన పడుతున్నాం” అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సాగునీరు అందక ఒకవైపు, దుర్వాసనతో మరోవైపు అన్నదాతలు నరకయాతన అనుభవిస్తున్నారు.
అధికారులు స్పందించాలి:
ఇరిగేషన్ శాఖ అధికారులు ఇప్పటికైనా తక్షణమే స్పందించాలని రైతులు కోరుతున్నారు. కాలువలో పేరుకుపోయిన పూడిక, చెత్తను యుద్ధ ప్రాతిపదికన తొలగించాలని, అలాగే సాగునీటి కాలువల్లో చెత్త వేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రాంతంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలని కూడా రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
సాగునీటి వనరులను కాపాడటం అధికారుల బాధ్యత మాత్రమే కాదు, ప్రజల బాధ్యత కూడా అనే విషయాన్ని గుర్తు చేసుకుంటూ, వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.








