అనంతపురం జిల్లా, గుంతకల్లు: గుంతకల్లు పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో గుంతకల్లు నియోజకవర్గానికి చెందిన మూడు మండలాల ప్రత్యేక అధికారులతో డీఎల్డీఓ విజయలక్ష్మి అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ, సర్పంచుల పదవీకాలం ముగియడంతో గుంతకల్లు, గుత్తి, పామిడి మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు తెలిపారు. ప్రజలకు సంబంధించిన ఏ చిన్న సమస్య అయినా వెంటనే స్పందించి పరిష్కరించేలా అధికారులు పని చేయాలని సూచించారు.
ప్రత్యేకంగా వేసవి కాలంలో ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో గ్రామాల్లో త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వం కేటాయించిన ప్రత్యేక నిధులను పూర్తిగా వినియోగించి నీటి ఎద్దడిని నివారించాలని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా మండల అధికారులు స్పందిస్తూ, తమ దృష్టికి వచ్చే ప్రతి సమస్యను వెంటనే పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. మూడు మండలాల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును గమనించి, పరిష్కారం కాని సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో గుంతకల్లు టిడిపి పట్టణ బాధ్యుడు గుమ్మనూరు నారాయణస్వామి, తాసిల్దార్లు రమాదేవి, పుణ్యవతి, ఎంపీడీవోలు తేజోష్ణ, ప్రభాకర్ నాయక్, ఎంఈఓ రవి నాయక్, డిప్యూటీ తాసిల్దార్ సూర్యనారాయణతో పాటు మండల కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.








