కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, కాగజ్నగర్: అర్హులైన ప్రతి పేదవారికి ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్సీ దండే విఠల్ స్పష్టం చేశారు. ఈ దిశగా “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక”ను రూపొందించి అమలు చేస్తున్నట్లు తెలిపారు.
శనివారం కాగజ్నగర్లో సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్ల అధ్యక్షతన సిర్పూర్ నియోజకవర్గ స్థాయి ప్రజా పాలన – ప్రజా ప్రణాళిక సమీక్షా సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ, మార్చి 6న ప్రారంభమైన 99 రోజుల ప్రత్యేక కార్యాచరణ జూన్ 12 వరకు కొనసాగుతుందని వెల్లడించారు. జూన్ 2 నాటికి క్షేత్రస్థాయిలో పాలనలో స్పష్టమైన మార్పులు కనిపించాలని అధికారులకు సూచించారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదల ఇల్లు కల నెరవేరుస్తామని, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపులో రాజకీయ జోక్యం లేకుండా అర్హతకే ప్రాధాన్యత ఇస్తామని భరోసా ఇచ్చారు. రైతాంగానికి ఎంతో ఉపయోగకరమైన జగన్నాథపూర్ ప్రాజెక్టు పునరుద్ధరణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టనున్నట్లు ప్రకటించారు.
డీఎస్పీ వహీద్ ఉద్దీన్ మాట్లాడుతూ గంజాయి సాగు, రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాంటి కార్యకలాపాలకు పాల్పడే వారు ప్రభుత్వ ప్రయోజనాలకు దూరమవుతారని పేర్కొన్నారు. రోడ్డు భద్రత కోసం ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు.
తహసీల్దార్ మధుకర్ మాట్లాడుతూ ఇసుక అక్రమ రవాణాపై నిఘా పెంచినట్లు, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఈ సమావేశంలో సన్నరకం వరి పండించే రైతులకు ప్రభుత్వం ప్రకటించిన బోనస్ వివరాలను అధికారులు వివరించారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించే దిశగా రైతులకు అవగాహన కల్పించాలని నిర్ణయించారు.
ఈ సమీక్షా సమావేశంలో మున్సిపల్ చైర్మన్ షహీన్ సుల్తానా, మార్కెట్ కమిటీ చైర్మన్ సిద్ధాల దేవయ్య, వివిధ మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, సర్పంచులు, కౌన్సిలర్లు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








