కొల్కతా, మే 8: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేసేందుకు నిరాకరించడంతో గవర్నర్ ఆర్.ఎన్. రవి రాష్ట్ర శాసనసభను అధికారికంగా రద్దు చేశారు. అసెంబ్లీ గడువు గురువారం అర్ధరాత్రితో ముగియనున్న నేపథ్యంలో రాజ్భవన్ విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 174(2)(బి) ప్రకారం తనకు కల్పించిన అధికారాలను వినియోగిస్తూ, మే 7 నుంచి శాసనసభను రద్దు చేస్తున్నట్లు గవర్నర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో రాజ్యాంగపరమైన మరియు రాజకీయ అనిశ్చితి నెలకొంది.
ఇదిలా ఉండగా, అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు జరిగాయని మమతా బెనర్జీ ఆరోపిస్తున్నారు. ఈ వివాదం త్వరలోనే న్యాయస్థానాలకు చేరే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
రాజ్యాంగం ఏమి చెబుతోంది?
ప్రస్తుత పరిస్థితులపై రాజ్యాంగ నిపుణులు వివరణ ఇస్తున్నారు. విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీకి చెందిన న్యాయ నిపుణుడు స్వప్నిల్ త్రిపాఠి మాట్లాడుతూ, ఆర్టికల్ 174(2)(బి) కింద అసెంబ్లీ రద్దైన తర్వాత మంత్రిమండలికి రాజ్యాంగబద్ధమైన ఆధారం ఉండదని తెలిపారు.
“ఇటువంటి పరిస్థితుల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు తాత్కాలికంగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు మాత్రమే అవకాశం ఉంటుంది. అది కూడా గవర్నర్ అనుమతిపై ఆధారపడి ఉంటుంది. ఇది రాజ్యాంగ సంప్రదాయం మాత్రమే, కచ్చితమైన నిబంధన కాదు,” అని ఆయన వివరించారు.
మమతా బెనర్జీ రాజీనామాకు నిరాకరించినప్పటికీ, రాజ్యాంగపరంగా దానివల్ల పెద్దగా మార్పు ఉండదని ఆయన స్పష్టం చేశారు. తదుపరి దశలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలలో మెజారిటీ మద్దతు ఉన్న నాయకుడిని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్ ఆహ్వానించాల్సి ఉంటుందని తెలిపారు.
మమతా బెనర్జీ ముందున్న మార్గాలు
అసెంబ్లీ రద్దు అనంతరం ముఖ్యమంత్రి పదవిలో కొనసాగేందుకు మమతా బెనర్జీకి రాజ్యాంగబద్ధంగా అవకాశం ఉండదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ప్రభుత్వం సమష్టిగా బాధ్యత వహించాల్సిన శాసనసభే ఇక ఉనికిలో లేకపోవడం వల్ల సీఎం పదవికి ప్రజాస్వామ్యపరమైన ఆధారం కోల్పోయినట్లవుతుంది.
ఒకవేళ ఎన్నికల ప్రక్రియ లేదా ఫలితాలపై అభ్యంతరాలుంటే, ప్రజాప్రాతినిధ్య చట్టం-1951 ప్రకారం ఎన్నికల పిటిషన్ దాఖలు చేయడమే సరైన మార్గమని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు. సంబంధిత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి, నిర్దిష్ట నియోజకవర్గంలో చట్ట ఉల్లంఘనలు జరిగాయని నిరూపించాల్సి ఉంటుందని వారు పేర్కొన్నారు.








