తెలంగాణలో స్త్రీనిధి సంస్థలో జరుగుతున్న అక్రమాలపై మంత్రి సీతక్క వెంటనే స్పందించాలని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక విజ్ఞప్తి చేశారు. మహిళల ఆర్థిక సాధికారతకు తోడ్పాటునివ్వాల్సిన స్త్రీనిధి సంస్థ అక్రమార్కులకు అడ్డాగా మారిందని ఆరోపిస్తూ ఆమె ‘ఎక్స్’ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు.
స్త్రీనిధి సంస్థను తన గుప్పెట్లో పెట్టుకుని అనేక అక్రమాలకు పాల్పడుతున్న ఎండీ, ఇప్పుడు దొడ్డిదారిన సంస్థకు ఎక్స్ అఫీషియో ఛైర్మన్ పదవిని దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని కవిత ఆరోపించారు. ప్రభుత్వ పెద్దల అండదండలతో ఈ నెల 16వ తేదీన జరగనున్న స్త్రీనిధి ఉద్యోగుల సమావేశంలో ఎక్స్ అఫీషియో చైర్మన్ పోస్టును సొంతం చేసుకునేందుకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని పేర్కొన్నారు.
సదరు ఎండీ పదవీకాలం ఈ నెల 23వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో, ఎలాగైనా సంస్థపై తన ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆమె విమర్శించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం, అక్రమార్కులను కీలక పదవుల్లో కొనసాగించేందుకు దిగజారుతోందని మండిపడ్డారు.
తన శాఖలో జరుగుతున్న అక్రమాలపై మంత్రి సీతక్క తక్షణమే స్పందించాలని కవిత డిమాండ్ చేశారు. స్త్రీనిధిలో అక్రమాలకు కేంద్ర బిందువుగా మారిన ఎండీపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే సంస్థలో నియామకాలు పూర్తిగా పారదర్శకంగా జరిగేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని సూచించారు.








